మూడు నెలల్లో 48 లక్షల కోట్లు ఉఫ్!

దేశీయ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని పతనాన్ని చవిచూస్తున్నాయి. గత 15 సంవత్సరాల కాలంలో స్టాక్ మార్కెట్ లు ఇంతలా పతనం అయిన సందర్భం లేదు. 2026 సంవత్సరంలోనే అంటే కొత్త ఏడాదిలోకి ప్రవేశించి ఇంకా నిండా మూడు నెలలు కూడా కాకముందే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 533 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఈ మొత్తం ఏకంగా దగ్గర దగ్గర 48 లక్షల కోట్ల రూపాయలు. 2011 సంవత్సరం తర్వాత స్టాక్ మార్కెట్ లో ఇంతటి పతనం ఇదే మొదటి సారి అని మనీ కంట్రోల్ .కామ్ తన కథనంలో ప్రస్తావించింది. కొన్ని రోజులు అమెరికా సుంకాల వ్యవహారం మార్కెట్ ను కుదిపేయగా...తర్వాత ఏఐ భయాలతో ఐటి స్టాక్స్ భారీ ఎత్తున అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న వేళ ఫిబ్రవరి 28 న అమెరికా-ఇజ్రాయిల్ లు సంయుక్తంగా ఇరాన్ పై దాడికి దిగటంతో మార్కెట్లు మరో సారి భారీ నష్టాల్లోకి వెళ్లాయి.
ఈ యుద్ధం స్టార్ట్ అయి రెండు వారాలు కావస్తున్నా కూడా దీనికి ముగింపు ఎప్పుడు...ఎలా ఉంటుందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఒక వైపు అమెరికా, మరో వైపు ఇరాన్ లు ఇంకా సవాళ్లు విసురుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధంతో ముడి చమురు ధర బ్యారెల్ వంద డాలర్లను అధిగమించటంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ లు కూడా ఉలిక్కిపడ్డాయి. చమురు ధరలతో పాటు గ్యాస్ సమస్య కారణంగా రాబోయే రోజుల్లో ద్రవ్యోల్భణం పెరిగి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆయిల్ ధరలతో డాలర్ తో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్ట స్థాయి కి చేరుతోంది. ఇది కూడా రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.



