Telugu Gateway
Top Stories

ఏమి హామీ వచ్చిందో..పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఆగుతుందా?

ఏమి హామీ వచ్చిందో..పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఆగుతుందా?
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ సుంకాల విషయంలో చేసిన కామెడీ చూసి ప్రపంచం నివ్వెరపోయింది. అలా నిర్ణయాలు తీసుకోవటం..ఇలా వాయిదా వేయటం. ఒక్క సుంకాల విషయంలోనే కాదు...ట్రంప్ బాధ్యతలు చేప్పట్టిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు అమెరికా ను చిక్కుల్లో పడేసే ప్రమాదం ఉంది అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో భారత్ -పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో డోనాల్డ్ ట్రంప్ మాట విని భారత ప్రధాని మోడీ పాకిస్థాన్ విషయంలో కాల్పుల విరమణకు ఓకే చెప్పారు. ఇక పాకిస్థాన్ భారత్ లో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు ఉపక్రమించదా...భవిష్యత్ లో ఎలాంటి దాడులకు పాల్పడదా?. ఏమి హామీ వచ్చింది అని ఇప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారో రాబోయే రోజుల్లో కానీ తెలియదు.

కారణాలు ఏమైనా కానీ భారత్-పాకిస్థాన్ ల మధ్య వార్ టెన్షన్ కు బ్రేక్ పడింది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజల ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకరింప చేశారు. దీంతో భారత్ ప్రధాని మోడీ తో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు డోనాల్డ్ ట్రంప్ మాటలు విన్నట్లు అయింది. అయితే పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పటికిప్పుడు చెప్పటం కష్టం. శనివారం సాయంత్రం డోనాల్డ్ ట్రంప్ తొలుత ఈ కీలక అంశంపై ట్వీట్ చేశారు. రెండు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని అందులో పేర్కొన్నారు. కామన్ సెన్స్, తెలివితో ఈ నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

అయితే తొలుత ఇది నిజమా..కాదా అన్న అనుమానాలు చాలా మంది లో తలెత్తాయి. డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన వెంటనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. నిన్న రాత్రి అంతా కూడా రెండు దేశాలతో చర్చలు జరిపి పురోగతి సాధించినట్లు తెలిపారు. ట్రంప్ సోషల్ మీడియా లో ప్రకటన చేసిన కొద్ది సమయానికే భారత్ కూడా కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె డీ వాన్స్ తాము ఈ విషయంలో అసలు జోక్యం చేసుకోబోమని ప్రకటించారు. అసలు తమకు దీంతో సంబంధం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు.

కానీ సడన్ గా అమెరికా ఈ విషయంలో ఎంట్రీ ఇచ్చి...రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరపడంలో ఎందుకు ఆసక్తి చూపించింది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కొద్ది రోజుల నుంచి భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. టార్గెట్ గా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినా పాకిస్థాన్ మాత్రం భారత పౌరులను టార్గెట్ చేసుకుని అప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. వీటిని భారత్ కూడా ఎప్పటి కప్పుడు గట్టిగా తిప్పికొట్టింది. ఈ సారి భారత్ మాత్రం పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెపుతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో అమెరికా ఎంటర్ కావటం...ఎవరూ ఊహించని రీతిలో కాల్పుల విరమణ ప్రకటన రావటం మాత్రం చాలా మంది ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆర్థికంగా, అంతర్గతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది.

Next Story
Share it