బంగారు అభరణాల అమ్మకాలు... 2.6 లక్షల కోట్లు
2021లో 797 టన్నులకు చేరిన డిమాండ్
భారతీయులకు బంగారంపై ఉన్న మోజు ఎంతో అందరికీ తెలిసిందే. కాస్త డబ్బు చేతిలో కనపడితే చాలు..బంగారం కొనేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం. ఇందులో లాజిక్ కూడా ఉంటుంది. ఏ అవసరానికి అయినా ఉపయోగపడుతుందనే కోణం కూడా ఉంటుంది అందులో. అదే సమయంలో ఆభరణాలు చేయించుకునే వారూ ఎక్కువే. ప్రపంచ బంగారు సమాఖ్య (డబ్ల్యూజీసీ) వెల్లడించిన గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 2021లో బంగారం డిమాండ్ ఏకంగా 78.6 శాతం మేర పెరిగి 797 టన్నులకు చేరింది. అంతకు ముందు ఏడాది ఈ డిమాండ్ 446.4 టన్నులు మాత్రమే. 2021లో ఆభరణాల డిమాండ్ ఏకంగా 93 శాతం పెరిగింది. 2021లో 2.6 లక్షల కోట్ల అమ్మకాలు సాగాయి.
2022లో విధానపరంగా వచ్చే మార్పులపై ఈ డిమాండ్ ఆధారపడి ఉంటుందని డబ్ల్యూజీసీ అంచనా వేస్తోంది. అయితే కొత్త వేరియంట్లు రావటం ఆగిపోయి..ఎలాంటి సమస్యలు రాకపోతే మాత్రం ఈ ఏడాది డిమాండ్ 800 నుంచి 850 టన్నులకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెళ్ళిళ్లు, పండగల కారణంగానే గత ఏడాది ఆభరణాల డిమాండ్ లో అనూహ్య మార్పులు వచ్చాయని.ఒక మాటలో చెప్పాలంటే కరోనా ముందు నాటి పరిస్థితులను తలపించాయని చెబుతున్నారు. 2020లో ఆభరణాల అమ్మకాల విలువ 1,33,260 కోట్ల రూపాయలు అయితే...2021లో ఇది 96 శాతం మేర పెరిగి 261140 కోట్ల రూపాయలకు పెరిగింది.