ఒక్క రోజులో 2.47 లక్షల కరోనా కేసులు
ఇది విస్పోటనమే. ఈ కేసుల సంఖ్య చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఒక్క రోజులోనే ఏకంగా 2.47 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవి గత 24 గంటల లెక్కలు. కేసుల సంఖ్య విషయంలో రోజుకో కొత్త రికార్డు నమోదు అవుతోంది. అయితే ఈ కేసుల్లో ఎక్కువ శాతం తీవ్రత లేనివి కావటం ఊరట కల్పించే విషయం. అందుకే గతంలో కన్పించినంత టెన్షన్ ప్రస్తుతం కన్పించటంలేదని చెప్పొచ్చు. అయితే ఆదమరచి..నిర్ల 2.47 నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఈ కేసుల సంఖ్య ఊహించనంత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 5488కి చేరాయి. తాజా కేసులతో దేశంలోపాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. ప్రస్తుతం భారత్ లో 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో 84,825 మంది కోవిడ్ నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో వెయ్యికిపైగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు దేశంలో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నా కేసుల వ్యాప్తి మాత్రం నియంత్రణలోకి రావటం లేదు. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీ గురువారం నాడు దేశంలోని ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఇందులో పెరుగుతున్న కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలకు మోడీ పలు సూచనలు చేసే అవకాశం ఉంది.