Telugu Gateway
Top Stories

ఐటి కంపెనీల సీఈఓలదే అగ్రస్థానం

ఐటి కంపెనీల సీఈఓలదే అగ్రస్థానం
X

దేశంలో అత్యధిక వేతనాలు పొందే సీఈఓల్లో ఎక్కువ మంది ఐటి రంగానికి చెందిన వారే ఉన్నారు. పది మంది టాప్ సీఈఓ ల వేతనాలను పరిగణనలోకి తీసుకుంటే ఇందులో ఏడుగురు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి ) రంగానికి చెందిన వారే . 2023 సంవత్సరంలో ఎక్కువ వేతనాలు పొందిన సీఈఓల జాబితా వెలువడింది. ఇందులో మొదటి స్థానం విప్రో సీఈఓ థియరీ డెలాపోర్ట్ దక్కించుకున్నారు. ఈయన వార్షిక వేతనం 82 కోట్ల రూపాయలు. తర్వాతి స్థానంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కర్ల వార్షిక వేతనం 61.7 కోట్ల రూపాయలు, ఎంఫసిస్ సీఈఓ నితిన్ రాకేష్ వేతనం 59 కోట్ల రూపాయలు. మరో దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 56.45 కోట్ల రూపాయలు ఉంది.

టెక్ మహీంద్రా సీఈఓ సి పీ గుర్నాని 30 కోట్ల రూపాయల వేతనం తీసుకుంటుంటే..టిసిఎస్ మాజీ సీఈఓ రాజేష్ గోపీనాథన్ 29 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాఫోర్జ్ సీఈఓ సుధీర్ సింగ్ వేతనం 33 .94 కోట్లు పొందినట్లు రికార్డు వెల్లడిస్తున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే ఐటి కంపెనీల సీఈఓ లు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళ వేతనాలు అధికంగా ఉంటాయని చెపుతున్నారు. జెరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్ లు ఒక్కొక్కరు 75 కోట్ల రూపాయల వేతనం తీసుకున్నారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వార్షిక వేతనం 12 కోట్ల రూపాయలు ఉంది. మరో మాటలో చెప్పాలంటే నాయకత్వ బాధ్యతలకు ఇస్తున్న ప్రతిపలంగానే వీటిని చూడాల్సి ఉంటుంది.

Next Story
Share it