అదానీ గ్రూప్ షేర్లలో ర్యాలీ అందుకే!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టీం తో అదానీ గ్రూప్ ప్రతినిధుల చర్చల్లో వేగం పుంజుకొంది. ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే అమెరికా లో నమోదు అయిన కేసు కు సంబంధించి త్వరలోనే సెటిల్ మెంట్ జరిగే అవకాశం కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఇదే కారణంతో సోమవారం నాడు భారతీయ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు అన్నీ దుమ్మురేపాయి. ఈ గ్రూప్ కు చెందిన అన్ని షేర్లు లాభాల బాటలోనే సాగాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా లో నమోదు అయిన కేసులో అదానీ గ్రూప్ కు పెద్ద ఎత్తున ఊరట లభించే అవకాశం ఉంది అనే వార్తలు రావటమే. భారత్ లో అదానీ గ్రూప్ కంపెనీలు సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ లు దక్కించుకునేందుకు ఇక్కడి అధికారులు..రాజకీయ నాయకులకు దగ్గర దగ్గర 2200 కోట్ల రూపాయల మేర ముడుపులు చెల్లించింది అని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దాచిపెట్టి ఇన్వెస్టర్లను మోసం చేశారు అనే కారణంతో అదానీ కంపెనీ లపై అమెరికా లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై గౌతమ్ అదానీ తో పాటు ఆయన సమీప బంధువు సాగర్ అదానీ పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.
అమెరికా కు చెందిన సెక్యూరిటీస్ ఎక్స్చేంజి కమిషన్ (ఎస్ఈసి) కూడా మరో కేసు నమోదు చేసింది. ప్రధాని మోడీ కి ఎంతో సన్నిహితుడిగా పేరున్న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే అదానిపై ఈ కేసు ఏ మాత్రం నిలబడదు అనే చర్చ కార్పొరేట్ వర్గాల్లో సాగింది. మహా అయితే జరిమానా కట్టి దీని నుంచి అదానీ గ్రూప్ బయటపడుతుంది అని ఎక్కువ మంది భావించారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1977 నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం (ఎఫ్ సిపీఏ) అమలును నిలుపుదల చేస్తూ ట్రంప్ కొద్ది నెలల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది ఇదే చట్టం కింద అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాలో అభియోగాలు నమోదు అయ్యాయి.
ఈ ఆదేశాలు కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన లో ఉన్న సమయంలో వెలువడటం కీలకం. ట్రంప్ ఆర్డర్ అదానీ గ్రూప్ తో పాటు పలు ఇతర కంపెనీలకు ఊరట కల్పించే నిర్ణయంగా అప్పటిలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ ఆదేశాల జారీ తర్వాత ఎఫ్ సిపీఏ ను అతిగా ఉపయోగించటం వల్ల అమెరికా కంపెనీలు ఇతర అంతర్జాతీయ సంస్థలతో సమానంగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయి అని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేయటం విశేషం. అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాలకు అనుగుణంగా ట్రంప్ టీం తో చర్చల కోసం అదానీ గ్రూప్ అమెరికాలో ఎంతో పేరున్న సంస్థలు అంటే న్యాయ పరంగా..లాబీయింగ్ సంస్థలతో డీల్ కుదుర్చుకుని ముందుకు సాగుతోంది అని చెపుతున్నారు. సోలార్ ప్రాజెక్ట్ లు దక్కించుకోవటం కోసం భారీ ఎత్తున లంచాలు ఇచ్చారు అంటూ ఆరోపణలు వచ్చిన సమయంలో అదానీ గ్రూప్ వీటిని తోసిపుచ్చింది. ఇప్పుడు అమెరికా లో ఈ కేసులు మూసి వేసే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్ షేర్ల సోమవారం నాడు పెద్ద ఎత్తున ర్యాలీ వచ్చింది అని చెప్పాలి.