Telugu Gateway
Top Stories

ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు

ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
X

కేంద్రం ఈ సంవత్సరం కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పెంచింది. కరోనా రెండవ దశ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి వ్యక్తులు దాఖలు చేయాల్సిన గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. అదే సమయంలో కంపెనీల రిటర్న్స్ గడువును నవంబర్ 30 వరకూ అవకాశం కల్పించారు. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటు ఇచ్చినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది.

మామూలుగా అయితే వ్యక్తులు జులై31లోగా, కంపెనీలు అక్టోబర్ 31లోగా రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ఫారం 16 గడువును కూడా జులై 15 వరకూ పొడిగిస్తూ సీబీడీటీ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఆదాయ పన్ను రిటర్న్ ల దాఖలును మరింత సులభతరం చేస్తూ కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐటి శాఖ తెలిపింది. జూన్ 7 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది.

Next Story
Share it