వజ్రాల వ్యాపారి భవనం ఖరీదు 185 కోట్లు
చదరపు అడుగు 93 వేలు
ఎంత ఖరీదైన నిర్మాణం అయినా అడుగు ధర 12 నుంచి 15 వేల రూపాయలు అంటేనే అమ్మో అంటాం. కానీ అక్కడ మాత్రం చదరపు అడుగు ధర ఏకంగా 93 వేల రూపాయలు పలికింది. హైదరాబాద్ లో కొత్తగా చేపట్టే ప్రీమియం అపార్ట్ మెంట్లలో కూడా ఏకంగా చదరపు అడుగు 22 వేల రూపాయలు ధర నిర్ణయిస్తున్నారు. మరి అలాంటిది ముంబయ్ లో అత్యంత ఖరీదైన వర్లి ప్రాంతంలో మరి ఆ మాత్రం ధర ఉండదా?. 19,886 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడిన భవనం 185 కోట్ల రూపాయలకు అమ్ముడు అయింది. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ఘనశ్యామ్ బాయ్ ధాంజీభాయ్ డోలాకియా ఈ భవనం కొనుగోలు చేశారు. బేస్ మెంట్ తోపాటు గ్రౌండ్ మరో ఆరు ఫ్లోర్లు ఇందులో ఉన్నాయి. ఈ భవనాన్ని పాన్హర్ బంగ్లాగా పిలుస్తారు.
ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద లావాదేవీ ఇదేనని ముంబయ్ రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఘనశ్యామ్ బాయ్ సోదరుల్లో ఒకరైన సావ్జి డొలాకియా తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, ఆభరణాలు ఇస్తూ చాలా సార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తమ ఉమ్మడి కుటుంబానికి సరిపోయే భవనం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నామని...ఈ భవనం తమ అవసరాలకు సరిగ్గా సరిపోతుందని తెలిపినట్లు హిందూస్థాన్ టైమ్స్ వెల్లడించింది.