తెలంగాణా, ఏపీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేసిన ఢిల్లీ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఢిల్లీ సర్కారు ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను తొలగించింది. అంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏపీ, తెలంగాణ నుంచి ఎవరు ఢిల్లీ వెళ్ళినా విధిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన విధించారు. అదే సమయంలో ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కూడా తప్పనిసరి చేశారు. అప్పుడు రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున ఉండటమే దీనికి కారణం. ఢిల్లీ కూడా కరోనాతో అతలాకుతలం అయినందున వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఇప్పుడు దేశమంతటా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఢిల్లీ సర్కారు వారంతపు మార్కెట్లకు కూడా అనుమతులు మంజూరు చేసింది. ఏపీ, తెలంగాణలో కూడా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రయాణాలపై ఆంక్షలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుంటారు. ఇంత కాలం ఆంక్షల కారణంగా ఇబ్బందిపడిన వివిధ వర్గాలకు ఇప్పుడు ఊరట లభించినట్లు అయింది.