రెండు వందల లక్షల కోట్లతో ఢిల్లీ-అయోధ్య మధ్య బుల్లెట్ ట్రైన్!
కేంద్రం కొత్త బుల్లెట్ రైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామాలయాన్ని ప్రపంచ పర్యాటకపటంలో పెట్టేందుకు వీలుగా ఢిల్లీ నుంచి అయోధ్యకు బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే ఢిల్లీ నుంచి అయోధ్యకు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య దూరం 941.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ ఎస్ఆర్ సీ) ఇప్పటికే ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి నిరంభ్యతరపత్రం (ఎన్ వోసీ) కోసం ధరఖాస్తు చేసింది. ఏఏఐ నుంచి ఎన్ వోసీ రాగానే పనులు ప్రారంభిస్తామని ఎన్ హెచ్ ఎస్ ఆర్ సీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 200 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు మార్గంలో ముఖ్యంగా ప్రధాన నగరాలైన లక్నో, అగ్రా వంటి చోట అండర్ గ్రౌండ్ లో ట్రాక్ వేయాలని తలపెట్టారు.
ఢిల్లీ-వారణాసి వయా ఆగ్రా, లక్నో, ప్రయాగ్ రాజ్ ల మీదుగా ఈ లైన్ వేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని తెలిపారు. అయోధ్యలో బుల్లెట్ రైలు స్టేషన్ కు సంబంధించి ఢిల్లీ నుంచి అధికారులు అయోధ్య వెళ్ళి స్థలాలను కూడా పరిశీలించారు. ఢిల్లీ నుంచి అయోధ్య మధ్య తలపెట్టిన ఈ బుల్లెట్ రైలు గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల స్పీడ్ లో వెళుతుంది. లక్నో-అయోధ్య మధ్య 30 కిలోమీటర్ల మేర ప్రత్యేక లింక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బుల్లెట్ రైళ్ళు న్యూఢిల్లీ-అయోధ్య మధ్య, మరొకటి న్యూఢిల్లీ-వారణాసిల మధ్య నడుస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.