కోవిషీల్డ్ బూస్టర్ డోస్ గరిష్ట ధర 780 రూపాయలు
కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ను ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనే అనుమతిస్తున్నట్లు ప్రకటించటం ఆలశ్యం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ధర ప్రకటించింది. తాము డిస్కౌంట్ ధరకు అంటే 600 రూపాయలకు వ్యాక్సిన్ అందిస్తామని వెల్లడించింది. దీనికి పన్నులు అదనం. ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా ఈ విషయం తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారెవరైనా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండవ డోసుకుని తొమ్మిది నెలలు పూర్తయిన వారే బూస్టర్ డోసుకు అర్హులు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిషీల్డ్ గరిష్ట ధర పన్నులతో కలుపుకుని 780 రూపాయలుగా నిర్ణయించారు.
వ్యాక్సిన్ కంపెనీలకు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారీ లాభాలను తెచ్చిపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కంపెనీలు రాయితీ ధరతో వీటిని సరఫరా చేసిన విషయం తెలిసిందే. అందులోనే లాభాలు ఉండగా..ఇప్పుడు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఇస్తున్న ధరలతో వీటికి కాసుల వర్షం కురవనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు అరవై సంవత్సరాల పైబడిన వారికి మాత్రం ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనే ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.