సీసీటీవీల ఏర్పాటు..ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రజల రక్షణకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడేళ్ల కాలంలో ఢిల్లీ అంతటా 2,75,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. చదరపు కిలోమీటరుకు 1826 సీసీటీవీ కెమెరాలతో ఢిల్లీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవగా, 1138 సీసీటీవీ కెమెరాలతో లండన్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధారించారు. రాబోయే రోజుల్లో కొత్తగా మరో 1,40,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ప్రధాన రహదారులతోపాలు కాలనీలు, పాఠశాలలు, ఇతర కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చారు. ఈ విషయంలో లండన్, సింగపూర్ ల కంటే ఢిల్లీ చాలా ముందు ఉంది. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తర్వాతే మహిళ రక్షణ మరింత మెరుగైనట్లు అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. పోలీసులకు కూడా నేరాలకు సంబంధించిన పరిశోధన ఈ కెమెరాలతో మరింత సులభం అవుతుందన్నారు. ఇంత కాలం దేశంలోనే అత్యధిక కాలుష్యంతో వార్తల్లో నిలిచిన ఢిల్లీ ఇప్పుడు ఓ పాజిటివ్ అంశంలో ఏకంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలవటం విశేషం.