Telugu Gateway
Top Stories

బిపిన్ రావ‌త్ కు పార్ల‌మెంట్ నివాళి

బిపిన్ రావ‌త్ కు పార్ల‌మెంట్ నివాళి
X

నేల‌కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్ లో దుర్మ‌ర‌ణం పాలైన భార‌త‌దేశ‌పు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావ‌త్ తోపాటు ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారికి పార్ల‌మెంట్ నివాళులు అర్పించింది. ఈ ప్ర‌మాదంపై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం నాడు ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య‌ మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఎయిర్ మార్ష‌ల్ మ‌న్వేంద్ర సింగ్ సార‌ధ్యంలోని క‌మిటీ విచార‌ణ జ‌రుగుతోంద‌ని తెలిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12.08 గంట‌ల‌వ‌కు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయ‌ని తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన స్థ‌లంలో భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు అక్క‌డ‌కు వెళ్లార‌ని, అప్ప‌టికే హెలికాప్ట‌ర్ మంట‌ల్లో కాలిపోతూ క‌న‌ప‌డింద‌ని ఆయ‌న స‌భ‌కు తెలిపారు.

వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న స‌హాయ సిబ్బంది శిథిలాల నుంచి అందిర‌నీ వెలికితీసి ఆసుప‌త్రికి త‌ర‌లించార‌న్నారు. మొత్తం 13 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో రావ‌త్ స‌హా అంత‌మంది ప్రాణాలు కోల్పోవ‌డం బాధాక‌రమ‌ని అన్నారు. రావత్ అంత్య‌క్రియ‌లు సైనిక లాంఛ‌నాల‌తో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వ‌రుణ్ సింగ్ ఒక్క‌రే ప్రాణాల‌తో మిగిలార‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సైనిక ఆసుప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంద‌ని, ఆయ‌న ప్రాణాలు కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని తెలిపారు. రావ‌త్ మృత‌దేహానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. ప్ర‌స్తుతం వెల్లింగ్ట‌న్‌లోని మ‌ద్రాస్ రెజిమెంట‌ర్ కేంద్రంలో బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది మృతదేహాలు ఉన్నాయి. రావ‌త్ అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం నాడు ఢిల్లీలో జ‌ర‌గ‌నున్నాయి.

Next Story
Share it