Telugu Gateway
Top Stories

ఆయన చేసే సాయం రోజుకు 22 కోట్లు!

ఆయన చేసే సాయం రోజుకు 22 కోట్లు!
X

కోట్ల రూపాయలు చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ వాటిని చాలా మంది అసలు బయటకు తీయరు. కొంత మంది మరీ దారుణానికి సొంతానికి కూడా వాడుకోరు. అలా వాటిని చూస్తూ మురిసికోవటమే. కానీ కొంత మంది మాత్రం దానకర్ణుల్లా సాయం చేస్తుంటారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం ప్రతి ఏటా కోట్లకు కోట్లు దానం చేస్తారు. అందులో విప్రోకు చెందిన అజిమ్ ప్రేమ్ జీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. ఆయన ఫ్యామిలీ 2020 సంవత్సరంలో వివిధ కార్యక్రమాల కోసం దానం చేసిన మొత్తం 7904 కోట్ల రూపాయలు. హురున్ ఇండియా అనే సంస్థ సిద్ధం చేసిన లెక్కల ప్రకారం దాతృత్వ జాబితాలో అజిమ్ ప్రేమ్ జీ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంది. ఆయన తర్వాత హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు చెందిన శివనాడార్ రెండవ స్థానంలో ఉన్నారు. 2020 సంవత్సరంలో శివనాడార్ కుటుంబం 795 కోట్ల రూపాయలు దానం చేయగా..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ 458 కోట్ల రూపాయలు దాతృత్వ కార్యక్రమాల కోసం ఇచ్చింది. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా కార్పొరేట్‌ రంగం భారీగా విరాళాలిచ్చింది. ప్రధానంగా టాటా సన్స్ 1500 కోట్ల రూపాయలు, ప్రేమ్‌జీ 1125 కోట్లు, అంబానీ 510 కోట్లు రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ 500 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ 400 కోట్లు, టాటా గ్రూపు 500 కోట్ల విరాళంగా ఇచ్చాయి.

దీంతో కలిపి ఈ ఏడాది ప్రేమ్‌జీ మొత్తం విరాళాలను 175శాతం పెరిగి 12,050 కోట్లకు చేరుకుంది.10 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వ్యక్తుల సంఖ్య అంతకుముందు కాలం 72 నుండి 78 కు స్వల్పంగా పెరిగిందని నివేదిక తెలిపింది. 27 కోట్ల విరాళంతో, ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన అమిత్ చంద్ర, అర్చన చంద్ర ఈ జాబితాలో ప్రవేశించిన తొలి, ఏకైక ప్రొఫెషనల్ మేనేజర్లు. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. నందన్‌ నీలేకని 159 కోట్లు, ఎస్ గోపాల కృష్ణన్ 50 కోట్లు, షిబులాల్ 32 కోట్లు డొనేట్‌ చేశారు. మరోవైపు 5 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన 109 మంది వ్యక్తుల జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో రోహిణి నీలేకని 47 కోట్ల రూపాయలతో టాప్‌లో ఉన్నారు.

Next Story
Share it