Telugu Gateway
Top Stories

అయోధ్యలో కీలక ఘట్టం పూర్తి (Ayodya Ram Mandir)

అయోధ్యలో కీలక ఘట్టం పూర్తి (Ayodya Ram Mandir)
X

రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. జనవరి 22 న అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయింది. ఐదు వందల సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. అయోధ్యలోని రామ జన్మభూమిలో కొత్తగా కట్టిన మందిరంలో బలరాముడి ప్రతిష్టాపన శాస్రోక్త్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ తో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ లు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఇక మంగళవారం నుంచి భక్తులకు రాముడి దర్శన భాగ్యం కలగనుంది. అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం, హారతి వేళలు ఎలా ఉండబోతున్నయో వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. జాగరణ హారతి ఉదయం ఆరున్నరకు ఉంటుంది. అయితే దీనికి ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సంధ్యా హారతి రాత్రి ఏడున్నర గంటలకు. ఇది పూర్తిగా టికెట్స్ అందుబాటుని బట్టి ఉంటుంది. అయోధ్య రామ మందిరంలో బలరాముడి దర్శనం కోసం వెళ్లే వాళ్ళు కచ్చితంగా ఆధార్ కార్డు లేదంటే ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది. హారతి పాస్ లో ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ తో ఈ పని చేయవచ్చు. అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఇది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయోధ్య రామాలయం లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. రామాలయం నిర్మాణంలో జరిగిన జాప్యానికి రాముడు క్షమిస్తాడు అని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సజావుగా పూర్తి కావటానికి న్యాయవ్యవస్థ ఎంతో కీలక భూమిక పోషించేంది అని తెలిపారు. మోడీ తన ప్రసంగంలో రామాయణంలోని పలు పాత్రల విశిష్టతను గుర్తుచేశారు.

ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శబరి, నిషాద రాజు గుహుడు, ఒక ఉడుత, జటాయువు పాత్రలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. రామభక్తురాలైన శబరి మాతకు రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె ఏళ్ల తరబడి రాముని రాకకోసం నిరీక్షించి తన కలను సాకారం చేసుకున్న గిరిజన మహిళా శిరోమణి. అరణ్యవాసంలో రాముడు శబరి ఆతిథ్యం తీసుకుని ప్రేమతో అందించిన పళ్లను స్వీకరించి ఆమె జన్మను చరితార్ధం చేశాడు. శబరి మాత రామునిపై ఉంచిన విశ్వాసం గొప్పదని, రాముడు వస్తాడనే ఆమెకున్న నమ్మకమే పునాదిగా ఉజ్వల భారతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాముడు, సీత, లక్ష్మణులను గంగానది దాటించి వారిపట్ల స్నేహశీలతను చాటుకున్న గిరిజన నేత గుహుడు. వారి మైత్రీ బంధం రామాయణంలో పలు చోట్ల కనిపిస్తుంది. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత కూడా తన మిత్రుడిని మరిచిపోకుండా కలుసుకుంటాడు. రాముడు-గుహుడి మధ్య మైత్రీబంధాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావిస్తూ, దేశ నిర్మాణంలో ప్రజలంతా ఇలాంటి మైత్రీబంధాన్ని కలిగి ఉండాలని, రామాయణంలోని గుహుడి పాత్ర ఇందుకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. లంక చేరడానికి వారధి నిర్మించే సమయంలో అల్పప్రాణి అయిన ఉడుత సాయం చేసిన కథ కూడా రామాయణ ప్రాత్రల్లో ప్రచారంలో ఉంది. వారధి కోసం హనుమంతుడు, ఇతర వానరులు పెద్ద పెద్ద బండరాళ్లు సముద్రంలో పడవేస్తుండగా, ఉడుత సైతం వారితో పాలుపంచుకుని చిన్నచిన్న గులకరాళ్లు తెచ్చి సముద్రంలో జారవిడచేది. ఉడుత సాయం రాముని ప్రశంసలు సైతం అందుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, నేను సాధారణ వ్యక్తిననుకునే వాళ్లు ఉడుత సాయాన్ని గుర్తుంచుకోవాలని, సాయం చిన్నదైనా, పెద్దదైనా జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.

Next Story
Share it