Telugu Gateway
Top Stories

కరోనా రోగులకు ఊరట..డీఆర్ డీవో..రెడ్డీస్ నుంచి కొత్త డ్రగ్

కరోనా రోగులకు ఊరట..డీఆర్ డీవో..రెడ్డీస్ నుంచి కొత్త డ్రగ్
X

దేశాన్ని కరోనా రెండవ దశ కుదిపేస్తున్న తరుణంలో ఓ శుభవార్త. భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో) రోగులకు ఊరట కల్పించేలా ఓ కొత్త మందును అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ కూడా ఇందులో పాల్గొంది. ఢిల్లీలోని ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్‌ రూపొందించిన ఈ యాంటీ కరోనా డ్రగ్ అత్యవసర ఉపయోగానికి అనుమతి లభించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ లో సానుకూల ఫలితాలు రావటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. తీవ్రమైన కోవిడ్‌ బాధితుల్లో ఈ మందు బాగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది. పొడి రూపంలో ఉండే 2-డీజీ ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకరాచ్చని కంపెనీ చెబుతోంది.

దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్‌ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ సెల్స్‌ లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా నిరోధిస్తుంది. దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విస్తరణ, బాధితులు ఆక్సిజన్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రగ్‌ ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.. రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా ఇది బాగా తగ్గిస్తుందని అంచనా. ఐఎన్‌ఎంఏఎస్- డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత ఏడాది మేలో కోవిడ్ -19 రోగులలో పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది. వీటి ఫలితాల ఆధారంగా డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్‌ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది.

Next Story
Share it