Telugu Gateway
Top Stories

అదానీ స్కాం..'మ్యూట్ లో పీఎం మోడీ'

అదానీ స్కాం..మ్యూట్ లో పీఎం మోడీ
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలనం సృష్టించిన అదానీ కుంభకోణాన్ని చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నాల్లో ఉంది. ఆర్ఎస్ఎస్ తో పాటు మరికొంత మంది కూడా అదానీ కి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై తన నివేదిక బహిర్గతం చేసిన వెంటనే కంపెనీ హిండెన్ బర్గ్ పై న్యాయపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ విచిత్రం ఏమిటి అంటే ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించిన దాఖలాలు లేవు. నిజంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక అంతా దురుద్దేశపూర్వక నివేదిక,,తప్పుల తడక అయితే అదానీ ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇది ఒకటి అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరి కొంత మంది మంత్రులు కూడా ఇది పూర్తిగా ప్రైవేట్ కంపెనీ వ్యవహారం అంటూ తప్పించుకుంటున్నారు. నియంత్రణ సంస్థలు తమ పనిలో ఉన్నాయంటూ చెపుతున్నారు. అయితే అదానీ సోదరుడు పన్ను స్వర్గ దేశాలు అయిన మారిషస్ తో పాటు ఇతర దేశాల్లో 38 షెల్ కంపెనీలు ఏర్పాటు, విదేశాల్లోని కంపెనీల ద్వారా ఆదాయం పెరిగినట్లు చూపించి షేర్లలో మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఆరోపించింది. కనీసం వెబ్ సైట్ కూడా లేని అటువంటి ఒక చిన్న ఆడిటింగ్ సంస్థ తో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ వంటి కంపెనీ ల ఖాతాలను ఆడిట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆడిట్ కంపెనీ మరో ఒక లిస్టెడ్ కంపెనీ లెక్కలు మాత్రమే చూసింది అని తెలిపారు. విదేశాల్లో షెల్ కంపెనీలు ..దొంగ లెక్కల మోసాలు వంటి ఎన్నో కీలక అంశాలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం ఎపిసోడ్ పై విచారణ జరిపిస్తాం అన్న ఒక్క మాట ఎందుకు చెప్పలేక పోతుంది అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీంతో కేంద్రంలోని మోడీ సర్కారుపై అనుమానాలు మరింత పెరుతున్నాయి. ఈ స్కాం వెలుగులోకి వచ్చాక అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు పది లక్షల కోట్లు తుడిచిపెట్టుకు పోయింది. దీంతో అటు ప్రమోటర్ల తో పాటు వాటా దారులు కూడా భారీగా నష్టపోయారు. నిర్మలా సీతారామన్ మాత్రం ఎల్ఐసి లాభాల్లోనే ఉంది చెప్పటం మరో కీలక అంశంగా మారింది. ఉదాహరణకు స్కాం బయటకు రాక ముందు ఎల్ఐసి లాభం 25 వేల కోట్లు ఉంటే..స్కాం బయటకు వచ్చాక అది 5 వేల కోట్లకు పడిపోయిన ఇంకా లాభాల్లోనే ఉంది అని చెప్పటం చూసి అందరు అవాక్కు అవుతున్నారు. దేశ కార్పొరేట్ రంగంలో ఇద్ద పెద్ద స్కాం జరిగితే ప్రధాని మోడీ మ్యూట్ లో ఉండటం ఏమిటో అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలు ఇదే అంశంపై రోజుల తరబడి వాయిదా పడుతున్నా కూడా మోడీ నోరు తెరవటం లేదు. అంటే అదానీ ని కాపాడేందుకే మోడీ ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు మూట కట్టుకుంటున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ వ్యవహారంలో కేంద్రం ఎందుకు ఇంతగా వెనకేసుకు రావాల్సి వస్తుంది. పార్లమెంట్ సమావేశాలు సాగక పోయినా కూడా దీని కంటే అదానీ ని కాపాడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు ఉంది అనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.



Next Story
Share it