Telugu Gateway
Top Stories

అదానీపై ఇప్పుడు మరిన్ని అనుమానాలు!

అదానీపై ఇప్పుడు మరిన్ని అనుమానాలు!
X

దేశంలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా తమపై ఎవరైనా నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తే వారి సంగతి చూస్తాయి. రకరకాల కేసు లు వేస్తాయి..వారిపై చర్యలకు ఉపక్రమిస్తాయి. ఎందుకంటే ఆ ఆరోపణలు ప్రజా బాహుళ్యంలోకి వస్తే కంపెనీతో పాటు ప్రమోటర్ల ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది కాబట్టి. అది కంపెనీ దీర్ఘకాల ప్రయోజనాలకు ప్రమాదం ఒకటి..ప్రజలు అటువైపు అనుమానంగానే చూస్తుంటారు. కానీ దేశ పారిశ్రామిక రంగంలో అనూహ్యంగా..అసాధారణంగా ఎదిగిన గౌతమ్ అదానీ ఎందుకు అందుకు భిన్నమైన వైఖరి అనుసరిస్తున్నారు. అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడుతుంది అని..విదేశాల్లోని షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమ మార్గంలో పొందుతుంది అని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ బయటకు వచ్చిన కొద్దిరోజులకు అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా పన్నెండు లక్షల కోట్ల మేర హరించుకు పోయింది. ఆ సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై భారత్ తో పాటు అమెరికా లో కేసు లు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అదే సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ నివేదిక భారత్ పై జరిగిన దాడిగా అదానీ గ్రూప్ అభివర్ణించింది. గౌతమ్ అదానీ కి ప్రధాని మోడీ తో ఎంతో సన్నిహితుడు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మోడీ విదేశీ పర్యటన చేసిన ప్రతిసారి అదానీ గ్రూప్ కు ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఒక వైపు అదానీ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలను దేశం పై దాడి గా చూపించే ప్రయత్నం చేశారు. దేశంలో ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రధాని మోడీ ఆశీస్సులు అదానీ కు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. అయినా సరే అదానీ గ్రూప్ ఇప్పటివరకు హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై ఎలాంటి చట్టపరమైన చర్యలకు శ్రేకారం చుట్టలేదు అంటే ఈ రిపోర్ట్ లో నిజాలే ఉన్నాయని అనుమానం మరింత బలపడుతోంది. ఎందుకంటే ఏకంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయినా...అప్పులు కట్టేందుకు కీలక కంపెనీల్లో వాటాలు అమ్ముతున్నా కూడా అదానీ గ్రూప్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ పై ఇప్పుడు మౌనాన్నే ఆశ్రయిస్తోంది. లీగల్ గా వెళితే అసలు బండారం మరింత బయటపడుతుంది అనే భయంతోనే అదానీ గ్రూప్ ఇలా చేస్తోంది అనే అనుమానాలు కార్పొరేట్ వర్గాల్లో ఉన్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో అదానీ గ్రూప్ ఒక్కటే కాదు...పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు కూడా నష్టపోయారు. కేంద్రంలోని మోడీ సర్కారు అదానీ గ్రూప్ కోసం బడ్జెట్ సమావేశాలను త్యాగం చేసింది కానీ...ఈ స్కాం పై మాత్రం జేపీసీ విచారణకు మాత్రం నో అంటోంది. దేశంలోని పార్టీలు అన్ని ఒక్కటే కోరినా కేంద్రం అదానీ కి మాత్రమే మద్దతు గా నిలబడింది.

Next Story
Share it