Telugu Gateway
Top Stories

టాటా గ్రూపును దాటేసిన అదానీ గ్రూపు

టాటా గ్రూపును దాటేసిన అదానీ గ్రూపు
X

స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల విలువ (మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్) మూడేళ్ళ వ్య‌వ‌ధిలోనే రెండు ల‌క్షల కోట్ల రూపాయ‌ల నుంచి 20.74 ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు చేరింది. దీంతో దేశంలోనే అత్యంత విలువైన గ్రూపుగా ఉన్న టాటా గ్రూపును వెన‌క్కి నెట్టి అదానీలు ముందుకొచ్చారు. అయితే టాటా గ్రూపు సంస్థ‌ల విలువ 20.7 ల‌క్షల కోట్ల రూపాయ‌లుగా ఉంది. కాక‌పోతే ఈ రెండు గ్రూపుల మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసం చాలా స్ప‌ల్ప‌మే. మూడేళ్ల వ్య‌వ‌ధిలోనే అదానీ గ్రూపున‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల విలువ ఈ స్థాయిలో పెర‌గ‌టం పెద్ద సంచ‌ల‌నంగానే చెప్పుకోవ‌చ్చు. దీంతో అదానీల సంప‌ద అనూహ్యంగా పెర‌గ‌టంతో ఈ షేర్ల‌లో పెట్ట‌బ‌డి పెట్టిన మ‌దుప‌ర్లు కూడా ఇదే స్థాయిలో లాభ‌ప‌డ్డారు. 17.1 ల‌క్షల కోట్ల రూపాయ‌ల విలువ‌తో రిల‌య‌న్స్ గ్రూపు దేశంలో మూడ‌వ విలువైన గ్రూపుగా ఉంది.

మూడేళ్ల కాలంలోనే అదానీ గ్రూపున‌కు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మ‌దుప‌ర్ల సంప‌ద‌ను ఏకంగా 18.7 ల‌క్షల కోట్ల రూపాయ‌ల మేర పెంచాయి. 2019 చివ‌రి నాటికి ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కేవ‌లం రెండు ల‌క్షల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే. ఈ సంస్థ స‌గ‌టున నెల‌కు మ‌దుప‌ర్ల సంప‌ద‌ను 56,700 కోట్ల రూపాయ‌లు మేర పెంచింది. గ‌త కొంత కాలంగా అదానీ ప‌లు నూతన రంగాల్లోకి అడుగు పెట్టి భారీ పెట్టుబడుల‌తో హ‌వా కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా విమానాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ రంగంలోకి అడుగుపెట్టి జీవీకె నుంచి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ముంబ‌య్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని చేజిక్కించుకుంది. దీంతోపాటు ఏఏఐ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ప‌లు విమానాశ్ర‌యాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కూడా చేప‌ట్టి..ఈ రంగంలోనూ త‌న స‌త్తా చాటుతోంది. అదానీ ప్ర‌పంచ సంప‌న్నుల జాబితాలో ఇటీవ‌ల మూడు నుంచి ఏకంగా రెండ‌వ స్థానానికి చేరిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it