Telugu Gateway
Top Stories

షేర్ల రిగ్గింగ్ అదానీ కి అలవాటేనా..కేతన్ పరేఖ్ తో కలిసి అదే పని!

షేర్ల రిగ్గింగ్ అదానీ కి అలవాటేనా..కేతన్ పరేఖ్ తో కలిసి అదే పని!
X

కేతన్ పరేఖ్. స్టాక్ మార్కెట్ తో పరిచయం ఉన్న వాళ్ళు అందరికి పరిచయం ఉన్న పేరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఆయన పేరుతో కూడా ఒక స్కాం లిఖించి ఉంది మరి . అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో దేశ కార్పొరేట్ చరిత్రలో అసాధారణంగా ఎదిగిన అదానీ గ్రూప్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ కి చెందిన పాత విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవి చూస్తుంటే అదానీ గ్రూప్ కు షేర్ల రిగ్గింగ్ , స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కొత్త కాదు అనే విషయం బహిర్గతం అవుతోంది. ఇప్పుడు అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ చెప్పిన విషయం కూడా అదే. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున స్టాక్ ధరల్లో రిగ్గింగ్ కు పాల్పడటం తో పాటు విదేశాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు ద్వారా నిధులను అక్రమ మార్గంలో మళ్లించినట్లు పేర్కొంది. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నా దీని ప్రకంపనలు మాత్రం స్టాక్ మార్కెట్ లో కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సరే కేంద్రం మాత్రం ఈ విషయం లో విచారణకు సిద్ధం కావటం లేదు. ఈ తరుణంలో 2007 లో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అదానీ ప్రమోటర్ల ను రెండేళ్ల పాటు మార్కెట్ లో డీల్స్ చేయకుండా నిషేదించింది.

దీనికి కారణం కేతన్ పరేఖ్ స్కాం లో వీరి పాత్రా ఉన్నట్లు సెబీ విచారణలో తేలటమే. 1999 అక్టోబర్ నుంచి 2001 మార్చి మధ్య కాలంలో వివాదాస్పద స్టాక్ బ్రోకర్ కేతన్ పరేఖ్, అదానీ ప్రమోటర్లు కలిసి అదానీ షేర్లలో రిగ్గింగ్ కు పాల్పడినట్లు సెబీ తేల్చింది. ఈ కాలంలో అదానీ ఎక్సపోర్ట్స్ షేర్ లో అసాధారణ కదలికలు ఉండటం తో సెబీ విచారణ చేసింది. ఈ విచారణలో కేతన్ పరేఖ్ తో పాటు ఆయన కనుసన్నల్లో ఉండే కంపెనీలు మోసాలకు పాల్పడినట్లు తేల్చారు. అంతే కాదు అదానీ గ్రూప్, కేతన్ పరేఖ్ సంస్థల మధ్య షేర్ల లావాదేవీలతో పాటు నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పుడు దీనికి సంబదించిన టైమ్స్ అఫ్ ఇండియా వార్త క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన వాళ్లకు ..అదానీ గ్రూప్ కు గతంలో కూడా ఘనమైన చరిత్రే ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది చూసిన వాళ్లకు హిండెన్ బర్గ్ రిపోర్ట్ నిజమే అనిపించటంలో ఏ మాత్రం ఆశ్చ్చర్యం అనిపించదు మరి.

Next Story
Share it