అదానీ ఫ్యామిలీ సంపాదన రోజుకు 1002 కోట్లు!
గత ఏడాది దేశాన్ని కరోనా కుదిపేసింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. కొంత మందికి వేతనాల్లో కోత పడింది. అత్యంత సంక్లిష్ట సమయంలో గౌతం అదానీ..అతని కుటుంబం రోజుకు 1002 కోట్ల రూపాయలు సంపాదించింది. హురున్ ఇండియా తాజా లెక్కలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అదానీ ఇప్పుడు దేశంలోనే రెండవ సంపన్నుడుగా నిలిచారు. ముఖేష్ అంబానీ తర్వాతి స్థానం ఆయనదే. అదానీ ఫ్యామిలీ మొత్తం సంపద నాలుగు రెట్లు పెరిగి 5,05,900 కోట్ల రూపాయలకు చేరిందని ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నులు జాబితా 2021 వెల్లడించింది.
ఆసియాలో రెండవ సంపన్న వ్యక్తిగా నిలిచిన చైనాకు చెందిన జాంగ్ షాన్ షాన్ ను కూడా అదానీ దాటేశారు. ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ సంపాదన గత ఏడాదిలో రోజుకు 163 కోట్ల రూపాయలు మాత్రమే కావటం విశేషం. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తులు తొలిసారి వెయ్యి మందిని దాటేశారు. గత ఏడాది కొత్తగా ఈ జాబితాలోకి 179 మంది చేరారు.