Telugu Gateway
Top Stories

కొత్త విమానాశ్రయాల రేస్ లోనూ అదానీ

కొత్త విమానాశ్రయాల రేస్ లోనూ అదానీ
X

కేంద్రం కొత్తగా ప్రైవేట్ పరం చేయనున్న విమానాశ్రయాల రేస్ లో తాము ఉన్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అదానీ ఎయిర్ పోర్ట్స్ సీఈఓ అరుణ్ బన్సల్ వెల్లడించారు. కేంద్రం రాబోయే రోజుల్లో మరో 11 విమానాశ్రయాలను లీజ్ కు ఇవ్వాలని నిర్ణయించింది. వీటి బిడ్డింగ్ లో తాము పాల్గొంటామని..కొత్త విమానాశ్రయాలు దక్కించుకునే విషయంలో తాము చాలా ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు.ప్రస్తుతం అదానీ ఎయిర్ పోర్ట్స్ ఆదీనంలో ఉన్న లక్నో, అహ్మదాబాద్ విమానాశ్రయాలు తాజాగా ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డ్స్ దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరుణ్ బన్సల్ ఈ విషయం వెల్లడించారు. అదానీ ఎయిర్ పోర్ట్స్ ప్రస్తుతం దేశంలో మొత్తం ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. కొత్తగా లీజ్ కు ఇచ్చే విమానాశ్రయాలను 50 సంవత్సరాలు అద్దెకు ఇవ్వనున్నారు. వచ్చే ఐదు నుంచి పదేళ్ల సమయంలో దేశ విమానయాన రంగం మంచి ప్రగతి సాధిస్తుంది అని చెపుతూ..దేశంలోని విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారి సంఖ్య 90 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతర్జాతీయ వృద్ధిరేటు..జనాభా పరంగా చూస్తే ఈ విషయంలో భారత్ ఇంకా చాలా వెనకబడి ఉందని చెప్పారు.

పెరిగే ఈ డిమాండ్ ను తట్టుకోవటానికి విమానాశ్రయాల్లో చాలా మార్పులు చేయాల్సి ఉందని..అదే సమయంలో ప్రయాణికుల సామర్థ్యం కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది అని తెలిపారు. ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ అఫ్ ఇండియా బిడ్డింగ్ లో ఈ సంస్థ ఇప్పటికే ఆరు విమానాశ్రయ ప్రాజెక్టులు దక్కించుకుంది. అందులో అందులో లక్నో, మంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, గువాహటి, తిరువనంతపురం ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి. వాస్తవానికి బిడ్డింగ్ లో ఎవరు అయినా పాల్గొనే అవకాశం ఉన్నా కూడా దేశంలోని కీలక నగరాల్లో విమానాశ్రయ ప్రాజెక్ట్ లు అన్ని ఒకే కంపెనీ చేతిలో ఉంటే గుత్తాధిపత్యం కిందకు రాదా అన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి గతంలో నీతి ఆయోగ్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. జీవీకె గ్రూపు నుంచి కూడా అదానీ గ్రూప్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే.

Next Story
Share it