Telugu Gateway
Telugugateway Exclusives

వైసీపీ లో షర్మిల కల్లోలం తప్పదా?

వైసీపీ లో షర్మిల కల్లోలం తప్పదా?
X

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ లో వై ఎస్ షర్మిల కల్లోలం తప్పదా?. కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న అడుగులు...ప్లాన్స్ ఫలిస్తే మాత్రం వచ్చే ఎన్నికలు వైసీపీకి చుక్కలు చూపించటం ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వై ఎస్ షర్మిల పేరు ప్రముఖంగా వినిస్పిస్తోంది. వైఎస్ఆర్ టిపీ పేరుతో ఆమె తెలంగాలో పార్టీ పెట్టినా కూడా అనుకున్నంత జోష్ రాలేదు. అయితే ఆమె ఇటీవల వరకు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చారు. కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో అప్పటినుంచి రాజకీయాలు శరవేగంగా మారుతూ పోతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వై ఎస్ షర్మిల ను తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణలోని వైఎస్ఆర్ టిపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ...ఆమెకు అంధ ప్రదేశ్ పీసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చెపుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు కడపలోని ఇడుపులపాయను సందర్శించి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పిస్తారని కూడా రెండు రోజులుగా మీడియా గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వై ఎస్ షర్మిల తో ఇప్పటికే కర్ణాటక పీసిసి ప్రెసిడెంట్, ఉప ముఖ్యమంత్రి డీ కె శివకుమార్ పలు మార్లు రాజకీయ అంశాలపై చర్చలు సాగించారు అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల తీసుకోవటానికి సిద్ధం అయితే ఆమెకు కర్ణాటక నుంచి రాజ్య సభకు పంపే హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. ఇప్పుడు అది అలా ఉంచి కడప లోక్ సభ బరిలో షర్మిలను నిలిపితే రాజకీయంగా పనికివస్తుంది అనేది కాంగ్రెస్ ఆలోచనగా చెపుతున్నారు.

ప్రస్తుతం వైసీపీ తరపున కడప ఎంపీగా ఉన్న వై ఎస్ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివేకా ఆలోచన కూడా కడప ఎంపీ బరిలో తాను లేదంటే వై ఎస్ విజయమ్మ, షర్మిల ఎవరో ఒకరు బరిలో ఉండాలని చెప్పినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని వై ఎస్ షర్మిలను కడప ఎంపీ బరిలో దింపటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఏమైనా లెక్క తేడా వచ్చినా కూడా షర్మిల రాజ్య సభ సీట్ ఎలాగు ఉంటుంది అని ఒక కీలక నేత ఒకరు వెల్లడించారు. రాహుల్ గాంధీ ని ప్రధాని చేయటమే తన లక్ష్యం అని గతంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు అని . ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరినా తన తండ్రి ఆశయ సాధన కోసం అని చెప్పుకోవచ్చు ...దీని వల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఉండవన్నది ఈ ప్రతిపాదన తెరపైకి తెస్తున్న వారి వాదన. మరి రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటం తో పాటు లోక్ సభ ఎన్నికల్లో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సారి తిరిగి ఖాతా ఓపెన్ చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

Next Story
Share it