Telugu Gateway
Telugugateway Exclusives

జ‌న్ ప‌థ్ నుంచి జ‌న‌ప‌థం లోకి

జ‌న్ ప‌థ్ నుంచి జ‌న‌ప‌థం లోకి
X

ఏదైనా ఫ‌లితం రావాలంటే ముందు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. అధికారం కోల్పోయిన ఎనిమిదేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ విష‌యంలో జ్ణానోదయం అయిన‌ట్లు ఉంది. ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు టెన్ జ‌న్ ప‌థ్ వీడి జ‌నప‌థంలోకి వెళ్ళాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కూ భార‌త్ జోడో (స‌మైక్య‌) యాత్ర త‌ల‌పెట్టింది. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి..వారితో మ‌మేకం అయితే త‌ప్ప కాంగ్రెస్ పార్టీకి తిరిగి పున‌ర్ వైభవం రాద‌నే విష‌యాన్ని అగ్ర‌నాయ‌క‌త్వం గుర్తించింది. అంతే కాదు..ప్ర‌జ‌ల‌తో పార్టీకి సంబంధాలు తెగిపోయాయ‌నే విష‌యాన్ని ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నిజాయ‌తీగానే అంగీక‌రించారు కూడా. అదే స‌మ‌యంలో ఈ సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గాలంటే అంత తేలిక‌కాద‌ని..దీనికి చెమటోడ్చాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రో కీల‌క అంశం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ కు మిష‌న్ 2024తో ప్ర‌జంటేష‌న్ ఇచ్చిన ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ కూడా పార్టీ నాయ‌కుడి సార‌ధ్యంలో పాన్ ఇండియా యాత్ర త‌ల‌పెట్టాల‌ని..ఇది గాంధీ సిద్ధాంతాల‌ను న‌మ్మేవారిని పార్టీలోకి తీసుకురావ‌టానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొన‌టం విశేషం.

వ‌ర‌స ఓట‌ముల‌తో గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఓ పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పోరాటాలు చేయాల్సిన అవ‌శ్య‌క‌త‌ను గుర్తించిన‌ట్లు క‌న్పిసోంది. ఇంత కాలం రాహుల్ గాంధీ కూడా కేంద్రంలోని మోడీ, బిజెపి ప్ర‌భుత్వాల‌పై ట్విట్ట‌ర్ లో విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇప్పుడు ఇది చాల‌ద‌ని..పార్టీలో స‌మూల మార్పులు చేయ‌టంతోపాటు..మ‌రింత క్రియాశీల‌క నాయ‌కుల‌ను సిద్ధం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌నే విష‌యాన్ని గుర్తించారు. అందులో భాగంగానే సీనియర్లు, జూనియ‌ర్ల మిశ్ర‌మం అన్న‌ట్లు టిక్కెట్ల‌ను 50 శాతం యువ‌త‌కు కేటాయించాల‌ని ప్ర‌తిపాదించారు. అంతే కాదు..పార్టీ ప‌ద‌వుల్లో కూడా 50 శాతం వ‌ర‌కూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు కేటాయించాల‌ని ప్ర‌తిపాదించారు. రాజ‌స్థాన్ లోని ఉద‌య‌పూర్ లో చేసిన డిక్ల‌రేష‌న్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగేందుకు స‌మాయ‌త్తం అవుతోంది. బిజెపిని ఓడించ‌టం ప్రాంతీయ పార్టీల‌తో సాధ్యంకాద‌ని..అది కాంగ్రెస్ పార్టీ వ‌ల్లే అవుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీని ద్వారా కేంద్రంలోని మోడీ, బిజెపి స‌ర్కారును ఓడించాల‌నుకునే వారు కాంగ్రెస్ తోనే క‌ల‌వాల్సి ఉంటుంద‌నే సంకేతాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం కేంద్రంలో అత్యంత శ‌క్తివంతంగా ఉన్న మోడీని, బిజెపిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it