Telugu Gateway
Telugugateway Exclusives

మంగళగిరిలో గెలవని లోకేష్....పాదయాత్రతో ఏపీలో టీడీపీని గెలిపిస్తారా?!

మంగళగిరిలో గెలవని లోకేష్....పాదయాత్రతో ఏపీలో టీడీపీని గెలిపిస్తారా?!
X

ఇదే ఇప్పుడు టీడీపీ తో పాటు రాజకీయ నేతల్లో సాగుతున్న చర్చ. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అప్పుడే ఎన్నికల దిశగా సాగుతున్నాయి. ఈ తరుణంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు సభలు విజయవంతం అవుతున్నాయి. ఇది అధికార వైసీపీలో కూడా ఒకింత చర్చకు కారణం అవుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తన పాద యాత్ర పై తాజాగా అధికారిక ప్రకటన చేశారు. మంగళగిరి నేతలతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. అదే సమయంలో మంగళగిరి నియోజకవర్గాన్ని కాపు కాసే బాధ్యత కార్యకర్తలు తమ భుజాన వేసుకోవాలని నారా లోకేష్ దిశానిర్దేశం కోరారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని కార్యకర్తలకు నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోనే నాలుగు రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని.. మిగిలిన రోజులు మాత్రం రాష్ట్రమంతా తిరగనున్నట్లు వెల్లడించారు. ఇది అంతా ఓకే. తాను పోటీ చేసిన ఎన్నికలో గెలవలేని నారా లోకేష్ రాష్ట్రం అంతా తిరిగి టీడీపీ ని గెలిపిస్తారా..ఇదే ఇప్పుడు టీడీపీ నేతల్లో సాగుతున్న చర్చ. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ పాదయాత్రలు చేసి విజయం సాధించిన వారు అంతా పార్టీ అధినేతలు. సిఎల్పీ నాయకులు. నారా లోకేష్ ఇందులో ఏది కాదు. మరి అయన పాదయాత్ర ప్రజలపై..పార్టీ నాయకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఇప్పుడు అత్యంత కీలకముగా మారింది. అంటే నాయకులు ఒక వైపు చంద్రబాబు జిల్లాల పర్యటనలు చూసుకోవాలి...మరో వైపు పాదయాత్ర లో పాలు పంచుకోవాలి.ఇవి ఒకే సారి ఉండకపోయినా ప్రతిపక్షంలో ఉండగా ఇద్దరు నాయకుల కార్యక్రమాలు అంటే ఒకింత కష్టంతో కూడుకున్న పనే అనే అభిప్రయం ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ గెలిస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు కి వెళ్తుందా...లేక నారా లోకేష్ కి వెళుతుందా అన్న సందేహాన్ని ఒక కీలక నేత వ్యక్తం చేశారు. మరో నాయకుడు అదేమీ కాదని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఆ క్రెడిట్ అంతా వైసీపీ అధినేత జగన్ కె దక్కుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీకి పడే ఓట్లు పార్టీ పై ప్రేమతో కంటే జగన్ పాలన పై వ్యతిరేకత తోనే ఎక్కువ ఉంటాయని అన్నారు. ఈ విషయం గుర్తించకుండా తాము లేకపోతే ఇక ఆంధ్ర ప్రదేశ్ కి భవిష్యత్ ఉండదు అనే తరహాలో మాట్లాడుతున్నారు అని కొంత మంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి కొంత అనుకూలంగా మారుతున్న పరిస్థితులను ఇలాంటి కామెంట్స్ తో చెడగొడుతున్నారు అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో సాగుతోంది. వచ్చే ఎన్నికలకు నారా లోకేష్ ను ముందు పెట్టి నడిపిస్తే ఇబ్బంది అని పార్టీ లో కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. ఆ తరుణంలో ఈ సారికూడా ఎన్నికలను లీడ్ చేసేది చంద్రబాబే అని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సభలు సూపర్ సక్సెస్ అవుతున్న తరుణంలో లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎలా ఉంటది. ఇంత కాలం జగన్ వెర్సస్ చంద్రబాబు అంటూ సాగిన ప్రచారం జగన్ వర్సెస్ నారా లోకేష్ గా మారితే పరిస్థితి ఏంటి..అదే సమయంలో మంగళగిరిలో సొంతంగా గెలవలేని లోకేష్...రాష్ట్రము అంతా తిరిగి టీడీపీని గెలిపిస్తాడా వంటి విమర్శలు వస్తాయని..వీటిని పేస్ చేయటం..సమాధానం చెప్పటం అంతా ఈజీ కాదని చెపుతున్నారు. ఇప్పుడు ఒకింత అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉన్న టీడీపీని లోకేష్ పాదయాత్ర ఎటు తీసుకెళుతుందో అన్న అనుమానాలు కూడా కొంత మంది నేతల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాళ్ళు దీనిపై మాట్లాడే పరిస్థితిలో లేరు.

Next Story
Share it