Telugu Gateway
Telugugateway Exclusives

బాలయ్యపై బాబుకు ఈ సడన్ ప్రేమ ఏంటో?!

బాలయ్యపై బాబుకు  ఈ సడన్ ప్రేమ ఏంటో?!
X

అది మహానాడు అయినా..ఏ తెలుగు దేశం కీలక సమావేశం అయినా వేదిక వెనక ఉండే ఫొటోల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, రెండు రాష్ట్రాల అధ్యక్షులు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోటో మాత్రమే పెడతారు. అలాంటిది బుధవారం నాడు హైదరాబాద్ లో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో వేదిక వెనక ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో తొలి సారి ఎన్టీఆర్ తనయుడు, హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోటో పెట్టారు. ఇది ఇప్పుడు టీడీపీ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ ఇలా బాలకృష్ణ ఫోటో పెట్టలేదు. ఇంతటి కీలక నిర్ణయం తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జానేశ్వర్ సొంతంగా తెసుకోగలరా అంటే నో అనే చెపుతున్నాయి టీడీపీ వర్గాలు. మరి ఇంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది అన్నది కూడా పార్టీ నాయకుల మధ్య చర్చ సాగుతోంది. వాస్తవానికి బాలకృష్ణ తనకు పొలిట్ బ్యూరో సభ్యత్వం ఇవ్వడంపై అప్పట్లో అలక పూనారు . చాలా రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కూడా ఉన్నారు.

గుంపులో గోవిందయ్యలాగా ఎంతో మంది ఉండే పొలిట్ బ్యూరో పోస్ట్ తనకు వద్దు అని...వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కోరినట్లు కూడా పార్టీ నేతల్లో ప్రచారం జరిగింది. తర్వాత అంతా సర్దుకుంది. త్వరలోనే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ ఇలా బాలకృష్ణ ఫోటో వేదికపై చోటు కల్పించటం అన్నది కీలకంగా మారింది. టాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకెళుతున్న బాలకృష్ణకు ఈ ఫోటో...ఈ ప్రచారం వల్ల వచ్చేదేమి ఉండదు. ఆయనకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రచారం కూడా కూడా అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు సడన్ గా పార్టీ ఆవిర్భావ సభ వేదిక ఫ్లెక్సీలో బాలయ్య ఫోటో పెట్టడం అన్నది టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సంప్రదాయం హైదరాబాద్ మీటింగ్ కే పరిమితం అవుతుందా..మే లో జరిగే మహానాడు లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తారా అన్నది వేచిచూడాలి. నారా లోకేష్ ఫోటో ఒక పక్కన, బాలకృష్ణ ఫోటో మరో పక్కన పెట్టారు ఈ సారి.

Next Story
Share it