Telugu Gateway
Telugugateway Exclusives

2500 కోట్ల రూపాయ‌ల స్కామ్ పై కెసీఆర్..కెటీఆర్ మౌనం ఎందుకో?!

2500 కోట్ల రూపాయ‌ల స్కామ్ పై కెసీఆర్..కెటీఆర్ మౌనం ఎందుకో?!
X

తెలంగాణ కోసం క‌డుపుక‌ట్టుకుని ..అటుకులు తిని ప‌నిచేస్తున్నాం. టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కెసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ప‌లుమార్లు చెప్పిన మాట ఇది. మ‌రి అలా ప‌నిచేసే సీఎం కెసీఆర్ రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లోని అత్యంత ఖ‌రీదైన‌..ఏకంగా 2500 కోట్ల రూపాయ‌ల భూ స్కామ్ పై ఎందుకు మౌనం గా ఉంటున్నారు. స్వ‌యంగా సీఎం కెసీఆరే రెవెన్యూ శాఖ‌ను చూస్తున్నారు. మ‌రి ఆయ‌న శాఖ‌లో ఇంత పెద్ద స్కామ్ జ‌రిగినా..క‌నీసం విచార‌ణ‌కు ఆదేశించ‌టం..చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌టం అధికార వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటీఆర్ కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యంపై నోరుమెద‌ప‌లేదు. రాష్ట్రం ఆర్ధికంగా ప‌లు క‌ష్టాలు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో..భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అందుబాటులో ఉంచాల్సిన ప్ర‌భుత్వ భూముల‌ను విక్ర‌యిస్తూ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని గొప్పగా చెప్పుకుంటూ...ప్ర‌భుత్వానికి చెందిన 2500 కోట్ల రూపాయ‌ల విలువ చేసే ప్ర‌భుత్వ భూమిని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు రాసివ్వ‌టాన్ని ఎలా చూడాలి. ప్ర‌భుత్వ పెద్ద‌ల మౌనం చూస్తుంటే ఇందులో ఏదో భారీ గోల్ మాల్ జ‌రిగింద‌నే అభిప్రాయం అధికార వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతోంది. అందుకే ఎవ‌రూ నోరుమెద‌ప‌టంలేద‌ని చెబుతున్నారు. అస‌లు ఈ స్కామ్ క‌థ ఏమిటంటే గుట్ట‌ల‌బేగంపేట గ్రామంలోని స‌ర్వే 63లో 54 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ కు చెందిన బినామీ వ్య‌క్తికి క‌ట్ట‌బెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇది ప్ర‌భుత్వ భూమి అయితే..ప్రైవేట్ ప‌ట్టా ల్యాండ్ గా ప్ర‌క‌టించారు. ఈ భూమి జూబ్లిహిల్స్ లోని మ‌ర్రిచెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల సంస్థ‌కు ఆనుకుని మ‌రీ ఉంటుంది. ఇక్క‌డ కీలక విష‌యం ఏమిటంటే ఈ భూమి త‌మ చేతికి రాక ముందే ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ సంప‌న్నుల‌కు గ‌జం 2 ల‌క్షల రూపాయ‌ల నుంచి 3 ల‌క్షల రూపాయ‌ల మేర విక్ర‌యించి సొమ్ము చేసుకుంది. వాస్త‌వానికి ఇది ప‌క్కాగా ప్ర‌భుత్వ భూమి అయితే దీన్ని ప్రైవేట్ ప‌ట్టా భూమిగా ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా..రిజిస్ట్రేష‌న్ల చ‌ట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి దీన్ని తొలగించారు. దీనికి సంబంధించిన స‌మ‌గ్ర క‌థ‌నాన్ని ప్ర‌ముఖ ఆంగ్ల‌ప‌త్రిక డెక్క‌న్ క్రానిక‌ల్ ప్ర‌చురించింది. ఇంత జ‌రుగుతున్నా కూడా రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు కిక్కురుమ‌న‌క‌పోవ‌టం కూడా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వార్త‌ను ట్యాగ్ చేస్తూ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియ‌ల్ ఎస్టేట్ స‌మితి అంటూ ఓ పోస్టు పెట్టి వ‌దిలేసింది. తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న బిజెపి మాత్రం దీనిపై ఎక్క‌డా నోరెత్తిన దాఖ‌లాలు లేవు. ఇదొక్క‌టే కాదు..న‌గ‌ర‌రంలోని కీల‌క ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూముల్లో భారీ డీల్స్ జ‌రుగుతున్నాయ‌ని..అంతా ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. తాజాగా ప‌లు సంస్థ‌ల‌పై జ‌రిగిన ఐటి దాడుల్లో ఈ భూ దందాలు అనేకం వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

Next Story
Share it