Telugu Gateway
Telugu

అమ‌లాపురం అల్ల‌ర్ల వెన‌క టీడీపీ..జ‌న‌సేన‌

అమ‌లాపురం అల్ల‌ర్ల వెన‌క టీడీపీ..జ‌న‌సేన‌
X

ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయ చేయ‌టం త‌గ‌ద‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ వ్యాఖ్యానించారు. ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్‌ అంబేద్క‌ర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేద్క‌ర్‌ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి.బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేద్క‌ర్‌ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేద్క‌ర్‌ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది.

మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్‌లో రాజ్యాంగం ఫెయిల్‌ అయిందని ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఈ అల్ల‌ర్ల వెన‌క ఖచ్చితంగా టీడీపీ, జ‌న‌సేన ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదిలా ఉంటే అమలాపురంలో విధ్వంసం కొనసాగుతుండ‌టంతో ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఇంకా రోడ్లపై వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించి వెళ్లి పోవాలని నిరసనకారులను పోలీసులు కోరుతున్నారు. బుధ‌వారం నాడు ఎలాంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని..ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story
Share it