Telugu Gateway
Telangana

అఖిలేష్ తో భేటీపై కెసిఆర్ మౌనం వెనక మతలబు ఏంటి?!

అఖిలేష్ తో భేటీపై కెసిఆర్ మౌనం వెనక మతలబు ఏంటి?!
X

కలవాల్సింది దేశ ప్రజలు తప్ప...పార్టీలు కాదు అని చెప్పిన సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్. మరి ఇప్పుడు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తో ఎందుకు సమావేశం అయినట్లు?. ఈ సమావేశం తర్వాత అధికార బిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఒకరిని దింపి..ఇంకొకరిని కూర్చోబెట్టడం రాజకీయమా అంటూ కెసిఆర్, కెటిఆర్ లు కొత్త కొత్త సూత్రీకరణలు తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళు ఇద్దరే గతంలో మోడీ ని బంగాళాఖాతంలో కలపాలి..బీజేపీ ముక్త భారత్ వంటి నినాదాలు కూడా ఇచ్చారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఒక్క సారిగా లెక్కలు తేడా రావటంతో మొత్తం ప్లేట్ పిరాయించినట్లు కనిపిస్తోంది అని బిఆర్ ఎస్ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాం కు తోడు ఐటి దాడుల్లో కూడా కీలక నేతల గుట్టు రట్టు అయింది అని...ఇవి అన్నీ చేతిలో పెట్టుకునే బిఆర్ఎస్ తో కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు రకరకాల పావులు కదుపుతోంది అనే ప్రచారం సాగుతోంది. లేక పోతే విపక్షాల కూటమిలో ఉన్న ఎస్పీ అధినేత , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో సీఎం కెసిఆర్ గంటల కొద్దీ సమావేశం అవ్వాల్సిన అవసరం ఏముంది...అసలు వీళ్ళు ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారనే విషయంపై బిఆర్ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వకపోవటంతో దీనిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జాతీయ పార్టీల ఎన్నికల ఆర్థిక అవసరాలు అన్నీ తాను చూసుకుంటాను అని సీఎం కెసిఆర్ హామీ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని ఇప్పటి వరకు బిఆఆర్ఎస్ ఎక్కడా ఖండించిన దాఖలాలు కూడా లేవు.

మరో వైపు అఖిలేష్ యాదవ్ మాత్రం కేంద్రంలోని బీజేపీ , మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది అన్నారు. మరో వైపు కెసిఆర్ సొంత పత్రికలో బీజేపీ ని ఓడించటానికి కెసిఆర్ అనుభవం, మద్దదు అవసరం, అసలు బిఆర్ఎస్ లేకుండా ఏమీ కాదు అని చెప్పినట్లు రాసుకున్నారు. మరి సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజలకు బహిరంగ సందేశాలు ఇచ్చినట్లు పార్టీ లు ఉన్నది ఒకరిని గద్దె దించటానికి కాదు...కలవాల్సింది పార్టీ లు కాదు..ప్రజలు అని చెప్పారా?. లేక తెర వెనక రాజకీయాలపై ఫోకస్ పెట్టారా?. ఇన్ని గంటలు కెసిఆర్, అఖిలేష్ యాదవ్ భేటీపై బిఆర్ఎస్ తన పార్టీ వైఖరి ఏంటో చెప్పలేదు అంటేనే ఇందులో ఏదో తేడా ఉంది అనే విషయం అర్ధం అవుతుంది అనే చర్చ సాగుతోంది. మరో వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చాలా చాలా స్పష్టంగా బిఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో తమ కూటమిలోకి రానివ్వం అని చెప్పిన వెంటనే కెసిఆర్, అఖిలేష్ యాదవ్ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెసిఆర్ ఇప్పుడు విపక్ష కూటమిలో చీలికకు ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కూడా కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ స్టాండ్ తరచూ మారుతూ పోతుంది అని..ఇది అంతిమంగా బిఆర్ఎస్ నష్టం చేయటం ఖాయం అనే భయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it