Telugu Gateway
Telangana

తెలంగాణాలో కొత్త చరిత్ర నమోదు అవుతుందా!

తెలంగాణాలో కొత్త చరిత్ర నమోదు అవుతుందా!
X

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రెండేళ్ల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ని బీజేపీ నాయకుడు సువెందు అధికారి ఓడించారు. అప్పటిలో అయన పేరు దేశ వ్యాప్తంగా మారు మోగింది. టీఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా మమతా బెనర్జీ ఓడిపోవటం పెద్ద సంచలనంగా మారింది. ఇదే సువెందు అధికారి ఒకప్పుడు మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ లో ఉన్నారు. తర్వాత బయటకు వచ్చి బీజేపీ లో చేరి మమతను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా అనే చర్చ రాజాకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఒకప్పుడు బిఆర్ఎస్ లో ఉండి బయటికి పంపివేయబడ్డ ఈటల ఇప్పుడు బీజేపీలో చేరి...సీఎం కెసిఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈటల తాను కెసిఆర్ ను గజ్వేల్ లో ఓడిస్తాను అని చెపుతూ వస్తున్నారు. ఇదే టార్గెట్ తో పని చేస్తున్నారు . ఇందులో విజయం సాధిస్తారా లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ మూడు వరకు ఆగాల్సిందే.

బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం తోనే ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు కెసిఆర్ ను ఓడించి తెలంగాణ సువెందు అధికారి అయ్యేది ఈటల రాజేందరా లేక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కెసిఆర్ ను ఈటల గజ్వేల్ లో ఢీకొడుతుంటే...కెసిఆర్ పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం కామారెడ్డి లో ఆయనపై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కెసిఆర్ ను అయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట..ఎవరు వోడించినా అది పెద్ద సంచలనమే అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళు కొత్త చరిత్రను రాసినట్లు అవుతుంది. అయితే ఈ ప్రయత్నంలో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి లు ఎంత మేర విజయం సాదించగలరో వేచిచూడాల్సిందే. కెసిఆర్ పై ఇద్దరు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో పరువు ఆయా నియోజకవర్గాలపై బిఆర్ఎస్ ఎన్నడూ లేని రీతిలో ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Next Story
Share it