Telugu Gateway
Telangana

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు

తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదు
X

కరోనా వైద్యం విషయంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తీరును తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. వ్యాపార ధోరణితో వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. బిల్లు కట్టకపోతే మృతదేహన్ని ఇవ్వకపోవటం వంటి చర్యలు సరికాదన్నారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల వెల్లడించారు. రాష్ట్రానికి 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే.. 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉందన్నారు. పీఎం కేర్ నిధులతో తెలంగాణలో 12 ఆక్సిజన్ తయారీ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనా రాకముందు 14 వందల బెడ్స్ కి మాత్రమే ఆక్సిజన్ సదుపాయం ఉండేదని, ప్రస్తుతం 10 వేల బెడ్స్‌ కు ఆక్సిజన్ సదుపాయం ఉందన్నారు. 700 ఐసీయూ బెడ్స్ కలిగిన గాంధీ ఆస్పత్రి దేశంలోనే పెద్దదని, మరో వారం రోజుల్లో 3010 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల పేషంట్లతో ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోయాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 350 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టిందని, తెలంగాణలో కూడా తగ్గుతాయని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్‌ కి ధరలు నిర్ణయించామని తెలిపారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ఉల్లంఘన కనిపిస్తుందన్న మంత్రి పెద్దమొత్తంలో డిపాజిట్ చేసుకున్న తర్వాతే వైద్యం చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లు కట్టలేదని శవాన్ని ఇవ్వడం లేదని, వ్యాపార కోణంలో ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. రాష్ట్రాలనే వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని కేంద్రం అనడం భావ్యం కాదని, కేంద్రానికి, రాష్ట్రాలకు వ్యాక్సిన్ ధరలు వేరువేరుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు.

Next Story
Share it