ఏసుక్రీస్తు వల్లే కరోనా పోయింది
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై వీహెచ్ పీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని తీవ్రంగా హెచ్చరించింది. హిందుత్వాన్ని, వైద్య విధానాన్ని, సైన్స్ ను, శాస్త్రవేత్తలను కించపరిచే స్థాయిలో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. లక్షల మంది వైద్యులు.. కోట్ల మంది వైద్య సిబ్బంది.. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదన్న విషయాన్ని శ్రీనివాస్ రావు విస్మరించడం ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అన్నారు. తమ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరినీ హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా ఆయన మాట్లాడారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.