టీఆర్ఎస్ అంటే నమ్మకం..బిజెపి అంటే అమ్మకం

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ పై మండిపడ్డారు. తన పాదయాత్రకు స్పందన లేకపోవటంతోనే బండి సంజయ్ బేకార్ మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. ప్రగతి భవన్ ఓ భవనం కాదు తెలంగాణ సకల జనుల సంక్షేమ భవన్ అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ లతో కలసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ కు నాలుగు కోట్ల ప్రజల అభిమానమే ఆస్తి ..వేరే ఆస్తులు లేవన్నారు.
తెలంగాణ ప్రజలను బికారి లు గా మార్చారు అన్న వ్యాఖ్యలు బండి సంజయ్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వినాయక నిమజ్జనం ముగిసింది ..ఇక ప్రతిపక్షాల నిమజ్జనమే మిగిలి ఉందన్నారు. 110 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన మోడీ దేశానికి చేసిందేమి లేదన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే నమ్మకం..బిజెపి అంటే అమ్మకం అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఎన్నికలో బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి నిలబెడుతారన్నారు.