Telugu Gateway
Telangana

తెలంగాణ టీడీపీ నిర్ణయం ఎవరికి నష్టం?!

తెలంగాణ టీడీపీ నిర్ణయం ఎవరికి నష్టం?!
X

టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ లో దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్ది నెలల పాటు హంగామా చేశారు...ఖమ్మం లో భారీ మీటింగ్ పెట్టి పార్టీలో ఒకింత జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. కారణాలు ఏంటో కానీ 2022 డిసెంబర్ లో ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు పెద్దగా చేపట్టలేదు. దీంతో ఒక్కసారి పార్టీ లో ఎప్పటిలాగే నిస్తేజం వచ్చింది. తెలంగాణాలో తెలుగు దేశం పార్టీ కి ఉన్న ఓటు బ్యాంకు చూపెట్టి రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల్లో బీజేపీ తో పెట్టుపెట్టుకోవటానికి చంద్రబాబు రెడీ అయినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరిగింది. అయితే అప్పటిలో తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ తాము టీడీపీ తో కాదు కదా ఎవరితో కలవం..ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ తాము రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడతామని ప్రకటించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సోమవారం నాడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయి రాష్ట్రంలో ఒంటరిగానే టీడీపీ పోటీ చేస్తుంది అని...ఎవరితో పొత్తులు లేవు అని ప్రకటించారు. నిజంగా టీడీపీ తెలంగాణ లో సీరియస్ గా పోటీ చేయాలి అనుకుంటే ఖమ్మం సభ తర్వాత వచ్చిన జోష్ ను ఎందుకు వదిలేసినట్లు...మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఒంటరి పోటీ రాగం అందుకున్నారు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటే చెప్పటం కష్టం కానీ..ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఆ పార్టీ కి ఓటు బ్యాంకు ఉంది అనటంలో సందేహం లేదు. అయితే ఓటర్లు కూడా కొన్ని సార్లు పార్టీ సీరియస్ నెస్ చూసి నిర్ణయాలు తీసుకుంటారు. టీడీపీ లో ప్రస్తుతానికి అయితే ఆ సీరియస్ నెస్ కనిపించటం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెపుతున్నట్లు 119 మంది నియోజక వర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపితే ఓట్లు చీలి అది ఖచ్చితంగా అధికార బిఆర్ఎస్ మేలు చేస్తుంది అనే అంచనాలు ఉన్నాయి. టీడీపీ బరి లో లేకపోతే మాత్రం ఆ పార్టీ ఓటు బ్యాంకు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి..ఒకప్పుడు టీడీపీ లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండటం ఒకటి అయితే... గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు కెసిఆర్ సహకారం అందించారు అనే కారణంతో వీళ్ళు అంతా కెసిఆర్ కు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడూ టీడీపీ పై ఎలాంటి విమర్శలు చేయకుండా ఆ పార్టీ ఓటు బ్యాంకు లో ఎక్కువ శాతం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణాలో అధికారంలోకి రావటం, సీఎం కెసిఆర్ పై పలు వర్గాల్లో వ్యతిరేకత ఉన్నందున ఈ సారి కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెరుగు అయ్యే ఛాన్స్ ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు తాజా నిర్ణయం టీడీపీ ని అన్ని రకాలుగా దెబ్బ కొట్టిన కెసిఆర్ కు మేలు చేయటం కోసమే తీసుకున్నట్లు కనిపిస్తోంది అని ఒక టీడీపీ నాయకుడు కూడా అనుమానం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపెట్టుకోవటం వాళ్ళ కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తిన్నదని ఆ పార్టీ నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ నిర్ణయం వెనక అసలు లెక్కలు ఏంటో రాబోయే రోజుల్లో అయినా బయటకు వస్తాయేమో చూడాలి.

Next Story
Share it