Telugu Gateway
Telangana

కాంగ్రెస్ లో నిలదొక్కుకుని...పార్టీని నిలబెట్టిన లీడర్

కాంగ్రెస్ లో నిలదొక్కుకుని...పార్టీని నిలబెట్టిన లీడర్
X

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ సంచలనం. కాంగ్రెస్ అధిష్టానం 2021 జూన్ లో ఆయన్ను టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించింది. సీనియర్ ల నుంచి పలు సవాళ్లు ఎదురైనా కూడా రేవంత్ రెడ్డి వీటి అన్నిటిని అధిగమించి కాంగ్రెస్ లో నిలదొక్కుకున్నారు. ఆయన నిలదొక్కుకోవటమే కాదు...రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు సానుకూలతలు ఉన్నా వాటిని పార్టీకి అనుకూలంగా మార్చటంలో గత ప్రెసిడెంట్ లు విఫలం అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో విజయం సాధించి పదేళ్ల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటంలో కీలక భూమిక పోషించారు. తాను నిలదొక్కుకుని ...కాంగ్రెస్ పార్టీని కూడా నిలబెట్టారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అండదండలతో పాటు...తర్వాత తర్వాత సో కాల్డ్ సీనియర్లు కూడా ఇష్టం లేకపోయినా సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణాలో కొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు. అదేంటి అంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్ సీఎం. డైరెక్ట్ ..ఇన్ డైరెక్ట్ సీఎం లు ఏంటి అనుకుంటున్నారా?. అంటే గతంలో ఎప్పుడూ ప్రభుత్వంలో భాగం కాకుండా...మంత్రిగా కూడా పనిచేయకుండా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేరుగా సీఎం కాబోతున్నారు. అందుకే అయన డైరెక్ట్ సీఎం అయ్యారు. ఇలా నేరుగా సీఎం అయ్యే ఛాన్స్ అతి తక్కువ మందికే దక్కుతుంది...తెలంగాణాలో ఈ ఛాన్స్ దక్కించుకున్న మొదటి వ్యక్తిగా కూడా రేవంత్ రెడ్డి పేరు రికార్డుల్లోకి ఎక్కనుంది.

తెలంగాణాలో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చటంలో రేవంత్ రెడ్డి కృషిని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం సిఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ని ఎంపిక చేసింది. సోమవారం ఉదయమే అధిష్ఠానం దూతలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ల అభిప్రాయాన్ని సేకరించి ఢిల్లీకి పంపారు. అంతకు ముందు కాంగ్రెస్ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎం ఎంపిక నిర్ణయం బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేశారు. సీఎం రేస్ లో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా కూడా త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలు...రాష్ట్రంలో కెసిఆర్ తర్వాత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ నేతలతో పాటు ఎక్కువ మంది మాత్రం సీఎం పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వటమే సరైన నిర్ణయం అన్న అభిప్రాయంతో ఉన్నారు. సిఎల్పీ సమావేశం తర్వాత సీఎం ఎంపిక వ్యవహారం ఢిల్లీ కి చేరింది. రాష్ట్రానికి పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కే శివ కుమార్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లు ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో సమావేశం అయ్యారు. ఆయన నివాసంలో జరిగిన భేటీలో రాహుల్ గాంధీ, కే సి వేణుగోపాల్ లు కూడా పాల్గొన్నారు. అక్కడే నిర్ణయం జరిగిపోయింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ మీడియా తో మాట్లాడుతూ డైనమిక్ లీడర్ అయినా రేవంత్ రెడ్డి నే సిఎల్పీ నేతగా ప్రకటించారు. ఈ ప్రకటన సమయంలో ఆయనతో పాటు సీఎం రేస్ లో నిలిచినా మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Next Story
Share it