సిట్టింగ్ సీటు కోల్పోయిన అధికార పార్టీ
పరిపాలనా పరంగా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు రాజకీయంగా మరో షాక్ తగిలింది. అధికారంలో ఉండి కూడా కరీంనగర్ సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోలేకపోవటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బిగ్ షాక్ గానే చెప్పాలి. గతంలో ఎన్నడూలేని రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. తాము అమలు చేసిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో స్వరం మారుస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు రాబోయే రోజుల్లో ఈ దూకుడును మరింత పెంచే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ను బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి దక్కించుకున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల తో ఆయన విజయం ఖరారు అయింది. కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన నరేందర్ రెడ్డి ఓటమి పాలు అయ్యారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ని కూడా బీజేపీ నే గెలిచిన విషయం తెలిసిందే. తెలంగాణ లో జరిగిన మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు బీజేపీ దక్కించుకోవటం ఆ పార్టీ లో జోష్ నింపింది అనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు ను గెలుచుకోలేకపోవటం రాజకీయంగా రేవంత్ రెడ్డి ని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది.
ఉప ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి వాటి విషయంలో ఎప్పుడైనా అధికార పార్టీ కి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ అధికారంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీటు ను నిలబెట్టుకోలేక పోవటం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో ఉంది. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యే ల కేసు సుప్రీం కోర్టు లో ఉంది. ఈ కేసు లో తీర్పు వస్తే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఇరకాటంలోకి నెట్టేవే.