Telugu Gateway
Telangana

జాతీయ పార్టీగా మారినా..కెటిఆర్ ఇంకా అక్కడే ఆగిపోయారా?

జాతీయ పార్టీగా మారినా..కెటిఆర్ ఇంకా అక్కడే ఆగిపోయారా?
X

ఏ విషయంపై స్పందించాలి...ఏ విషయంలో స్పందించకూడదో ఆయా పార్టీలు..వ్యక్తుల ఇష్టమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ డబల్ గేమ్ మాత్రం చర్చనీయంగా మారింది అనే చెప్పాలి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విషయంలో జగన్ సర్కారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మీడియా తో చిట్ చాట్ సందర్భంగా కెటిఆర్ ను మీడియా ప్రతినిదులు చంద్రబాబు అరెస్ట్ గురించి అడిగితే..పక్క రాష్ట్రాల విషయాలతో తమకు సంబంధం లేదు అన్నారు. ఓకే ...అది పూర్తిగా కెటిఆర్ ఇష్టమే. కానీ ఇదే కెటిఆర్ ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా అరెస్ట్ ను తప్పుపట్టారు. ఇది అప్రజాస్వామికం అని..బీజేపీ రాజకీయ కుట్ర, కక్ష సాధింపుల్లో భాగంగానే సిసోడియాను అరెస్ట్ చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ది పక్క రాష్ట్రం...నిన్న మొన్నటి వరకు కలిసి ఉన్న ప్రాంతం...చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. అదే పార్టీ లో ప్రస్తుత తెలంగాణా సీఎం కెసిఆర్ సుదీర్ఘకాలం ఉన్నారు కూడా. కానీ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించటానికి ఏ మాత్రం ఇష్టపడని.. ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా అరెస్ట్ పై స్పందించటం అంటే ఆయనకు తెలంగాణ తో ఏ మాత్రం అయినా సంబంధం ఉందా...పోనీ ఢిల్లీ ఏమైనా తెలంగాణ లో భాగంగా ఉందా?. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన సోదరి..ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉంది అని స్పందించారా?. కెటిఆర్ ఒక్కరే కాదు...సీఎం కెసిఆర్ కూడా సిసోడియా అరెస్ట్ ను తప్పుపడుతూ ప్రకటన విడుదల చేశారు అప్పటిలో. కానీ చంద్రబాబు అరెస్ట్ తో తమకు ఏ మాత్రం సంబంధం లేదు...తాము దీనిపై స్పందించం అన్నారు.

కెటిఆర్ ఇలా చెపుతుంటే...పార్టీ స్టాండ్ అందరికి ఒకేలా ఉండాలి కానీ...వర్కింగ్ ప్రెసిడెంట్ ది ఒక మాట...మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ప్రకటనలు చేస్తారు. ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఎక్కువ ఉన్న చోట ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ పని చేశారు. తమ పార్టీ వాళ్ళు ఎవరైనా దీనిపై మాట్లాడితే అది వారి వ్యక్తిగతం అన్నారు. పార్టీ కి ఒక లైన్...మంత్రులు...ఎమ్మెల్యేకు ఒక లైన్ ఉంటుందా ఒకే విషయంలో. చంద్రబాబు అరెస్ట్ అంశం కోర్ట్ లో ఉంది అని..ఇది తమకు అనవసరం అని కేటీఆర్ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మరో సారి స్పష్టం చేశారు. ఆంధ్రా లో ఉన్న సీఎం జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా తనకు స్నేహితులే అని...అక్కడ రెండు పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ వివాదంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. శాంతి భద్రతల కోణంలోనే హైదరాబాద్ ఐటి సెక్టార్ లో ధర్నాలు..నిరసనలకు అనుమతి ఇవ్వలేదు అని...ఈ విషయంలో ఏమి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనే చేసుకోవాలని కెటిఆర్ సూచించారు. ఇక్కడ కెటిఆర్ మరో కీలక అంశాన్ని మర్చిపోయారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్ గా మర్చి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశం అంతా పోటీ చేస్తాం అని ఒక వైపు కెసిఆర్ చెపుతుంటే కెటిఆర్ మాత్రం ఇంకా ప్రాంతీయవాదంతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రా ప్రదేశ్ తో సంబంధం లేదు అన్నప్పుడు ఆ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధ్యక్షుడుగా తోట చంద్ర శేఖర్ ను ఎందుకు నియమించినట్లు?. మొత్తానికి కెటిఆర్ తన వ్యాఖ్యల ద్వారా పార్టీ కి లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నారు అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it