Telugu Gateway
Telangana

తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలు ఇవే

తెలంగాణ లాక్ డౌన్ మార్గదర్శకాలు ఇవే
X

పది గంటల వరకూ మెట్రో..ఆర్టీసీ బస్సులకూ అనుమతి

ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో

తెలంగాణ సర్కారు లాక్ డౌన్ కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. బుధవారం నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ కు మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. మే 20న క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది. లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.

లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు :

వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.

తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.

-విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.

- జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.

- జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.

- కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు

- ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు

- ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.

- ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

- గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.

- అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి

- అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

- తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.

- ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

- కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.

- సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

-పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

Next Story
Share it