వాళ్లకు బూస్టర్ డోస్ అనుమతించాలి
కరోనా కొత్త వేరియంట్లు వస్తున్నందున హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు, హై రిస్క్ గ్రూపులకు బూస్టర్ డోస్ అనుమతించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. వీరందరికీ రెండో డోస్ వేసి 8-10 నెలలు దాటిందని లేఖలో మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని కూడా తగ్గించాలని హరీష్ రావు కేంద్ర వైద్య ఆరోగ్య వాఖను కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు హరీష్ శుక్రవారం నాడు లేఖ రాశారు. రెండో డోసుకు 12 వారాల వ్యవధి ఉండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తన లేఖలో పేర్కొన్నారు. వలస కూలీలు మొదటి డోస్ వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. వారిని గుర్తించి సెకండ్ డోస్ వేయడం చాలా కష్టంగా మారిందన్నారు.
ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఇబ్బంది ఎక్కువగా ఉందన్నారు. మొదటి డోస్ వేసుకున్నవారి వివరాలు కొవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా, ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్టు చెప్పారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది కొవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.77 కోట్ల డోసులను వేసినట్టు వెల్లడించారు. ఇందులో 2.49 కోట్లు మొదటి డోస్ అని, 1.28 కోట్లు రెండో డోస్గా పేర్కొన్నారు. అర్హులందరికీ టీకా రెండు డోసులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.