Telugu Gateway
Telangana

ఆస్తుల అమ్మ‌కం ప్రారంభించిందే వాళ్ళు

ఆస్తుల అమ్మ‌కం ప్రారంభించిందే వాళ్ళు
X

భూముల అమ్మ‌కాన్ని త‌ప్పుప‌డుతున్న కాంగ్రెస్, బిజెపిల‌పై మంత్రి హ‌రీష్ రావు విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరు గురిగింజ తీరుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. అసలు ఆస్తుల అమ్మకం ప్రారంభించిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌న్నారు. భట్టి విక్రమార్క భూములు అమ్మొద్దు.. అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటాం అనడం హస్యాస్ప‌దం అని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలు గా ఉండ‌గా 88,500 ఎకరాల భూములు అమ్మార‌న్నారు. గతంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అమ్మి ఆంధ్రాలో, రాయలసీమలో ఖర్చు పెడుతున్నారు అని.. నేను అసెంబ్లీలో అడిగితే నేటి ఈ కాంగ్రెస్ నాయకులు నోరు మెదప లేద‌ని విమ‌ర్శించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు నుంచి నేటి మోదీ వరకు పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న వారేన‌ని, కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం పడిపోయింద‌ని తెలిపారు. నిరర్ధక ఆస్తులు తీసేసి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నార‌ని తెలిపారు. భట్టి విక్రమార్క తన సీనియారిటీకి తగ్గట్టుగా మాట్లాడాల‌ని సూచించారు. భూముల అమ్మకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

భూముల అమ్మకాలతో వచ్చే ప్రతి పైసాను ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తామ‌ని, ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ త‌మ‌కు లేఖ రాసింద‌ని తెలిపారు. బీజేపీ ఒక్క సంవత్సరంలోనే పెట్రోల్ మీద 25రూపాయలు, డీజిల్ మీద 23 రూపాయలు పెంచింది. కరోనా కష్ట కాలంలో తెరాస ప్రభుత్వం ప్రజలను అదుకుంటోంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ మీద ఎక్సయిజ్ పన్ను 9 రూపాయలు ఉంటే ఇప్పుడు 32 రూపాయలకు పెంచింది. తెరాస ప్రభుత్వం పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది. అసెంబ్లీ సాక్షిగా.. నిరర్ధక ఆస్తులు అమ్మి ఆదాయం సమకూర్చుకుంటామని బడ్జెట్ లోనే చెప్పం. ప్ర‌తిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఆగిపోనివ్వం అని తెలిపారు.

Next Story
Share it