Telugu Gateway
Telangana

ఎంజీఎంను సందర్శించిన సీఎం కెసీఆర్

ఎంజీఎంను సందర్శించిన సీఎం కెసీఆర్
X

కరోనా వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వరస పెట్టి ఆస్పత్రుల సందర్శన ప్రారంభించారు. ఇటీవలే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి..అక్కడ సౌకర్యాలు..పేషంట్లకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కెసీఆర్ శుక్రవారం నాడు వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.

ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Next Story
Share it