Telugu Gateway
Telangana

జూన్ 8న తెలంగాణ మంత్రివ‌ర్గ‌ స‌మావేశం

జూన్ 8న తెలంగాణ  మంత్రివ‌ర్గ‌ స‌మావేశం
X

భారీ ఏజెండాతో తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం జూన్ 8న జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలోనే తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగింపుపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నందున ప‌గ‌లు అంతా మార్కెట్ల‌కు ఓపెన్ చేసి..కేవ‌లం రాత్రి వేళ‌ల్లోనే లాక్ డౌన్ అమ‌లు చేసే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. దీంతో పాటు ప‌లు అంశాలు మంత్రివ‌ర్గ‌ ఏజెండాలో ఉన్నాయి. జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ స‌మావేశం జర‌గ‌నుంది. ఈ సందర్భంగా.... రాష్ట్రంలో వైద్యం,కరోనా స్థితిగతులు ., ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు., లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.., అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో, ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి . థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో., థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత తగు ఏర్పాట్ల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. ఈ నెల 7న ప్రారంభించాలనుకున్న 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను జూన్ 9కి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో... ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.

Next Story
Share it