Telugu Gateway
Telangana

రోజురోజుకూ పడిపోతున్న కాంగ్రెస్ సర్కారు గ్రాఫ్!

రోజురోజుకూ పడిపోతున్న   కాంగ్రెస్ సర్కారు గ్రాఫ్!
X

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా మందికి ఫైటర్ గా కనిపించారు. అదే ఆయనకు సీఎం పీఠం దక్కేలా కూడా చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా హైదరాబాద్ వంటి నగరాన్ని పెట్టుకుని కూడా సీఎం రేవంత్ రెడ్డి హాండ్స్ అప్ అంటున్న తీరు చూసి ఆయన కేబినెట్ లోని మంత్రులు , కాంగ్రెస్ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఒక వైపు తెలంగాణ రైజింగ్ అని ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు స్వయంగా తన నోటి తో చెప్పులు ఎత్తుకుపోయేలా వాళ్ళలా చూస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం చూసి కీలక స్థానాల్లో ఉన్న నాయకులతో పాటు అధికారులు కూడా షాక్ కు గురి అయ్యారు అనే చెప్పాలి. ఉద్యోగ సంఘాల డిమాండ్ పై స్పందిస్తూ రేవంత్ రెడ్డి వాడిన భాష చూసి ఆయన సహచర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కి ఏమైంది అని చర్చించుకునే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఆ విషయం చెప్పటం ఏ మాత్రం తప్పు కాదు...ఉద్యోగ సంఘ నేతలతో మాట్లాడి అందుబాటులో ఉన్న పరిష్కారం మార్గాలు వెతకటం అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని.

ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన బకాయిలు పెండింగ్ లో పెట్టిన వ్యవహారం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఏమీ కాదు. బిఆర్ఎస్ హయాం నుంచి ఇదే తంతు ఉంది. అయినా అధికారంలోకి వచ్చిన పార్టీ నే బకాయిలతో పాటు ఇతర విషయాలను పరిష్కరించాల్సి ఉంటుంది. మరో వైపు ముఖ్యమంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం అసలు తమ పోటీ పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు . ఇది చెప్పి నెలలు కూడా గడవక ముందే రేవంత్ రెడ్డి రివర్స్ గేర్ వేయటం చూసి అవాక్కు అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాల డిమాండ్లు అన్నీ కరెక్ట్ గా అనిపించిన కాంగ్రెస్ పార్టీ కి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గొంతెమ్మ కోరికలుగా ఎలా కనిపిస్తున్నాయి అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఏడాదిన్నర కాలంలోనే కారణాలు ఏమైనా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

వీటికి తోడు రేవంత్ రెడ్డి బహిరంగంగా పలు మార్లు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి అనే అభిప్రాయం ఎక్కువ మంది లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత మంది ఐఏఎస్ అధికారులపై తీవ్రమైన విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్లనే కీలక స్థానాల్లో కొనసాగించడంతో పాటు ఏకంగా సీఎం ఆఫీస్ లోకి కూడా తీసుకుని ఉన్నదే వాళ్లే అని చెప్పటం చాలా మందిని విస్మయానికి గురి చేసింది అనే చెప్పాలి. ఉన్నది వాళ్లే అన్నప్పుడు మరి అప్పుడు కెసిఆర్ వాళ్లనే సంవత్సరాల తరబడి అదే పోస్ట్ ల్లో కొనసాగించటం కూడా తప్పు కాదు కదా అని ఒక ఐఏఎస్ అధికారి ప్రశ్నించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి కి ఇంకా పాలనలో పట్టు చిక్కలేదు అనే వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోకుండా బిఆర్ఎస్ పార్టీ నే బెటర్ అనే పరిస్థితి కాంగ్రెస్ నేతలే కల్పిస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it