Telugu Gateway
Telangana

ఈ సారి కాంగ్రెస్ ను ఎవ‌రూ ఆప‌లేరు

ఈ సారి కాంగ్రెస్ ను ఎవ‌రూ ఆప‌లేరు
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. వ‌రస బ‌హిరంగ స‌భ‌లు.ఆ స‌భ‌లు కూడా సక్సెస్ అవుతుండ‌టంతో పార్టీ నేత‌లు, క్యాడ‌ర్ లో ఉత్సాహం వ‌స్తోంది. ఈ ట్రెండ్ ను అలాగే కొన‌సాగించ‌టానికి ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి రాహుల్ గాంధీ వ‌చ్చేలా ప్ర‌ణాళిక ర‌చించారు. ఇదే అంశంపై గురువారం నాడు గాంధీ భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అందులోనే రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌పై కూడా చ‌ర్చించారు. సెప్టెంబర్ రెండో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించే అవ‌కాశం ఉంద‌న్నారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్‌లో నిర్వహించనున్నట్లు, ఆ సభకు రాహుల్ గాంధీ వస్తారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు.

గాంధీభవన్‌లో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మాణిక్య‌మ్ ఠాగూర్, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశంలో దళిత గిరిజన దండోరా, పార్టీ పనితీరుపై చర్చించారు. సెప్టెంబర్ 10 నుంచి 17 మద్య దండోరా సభ వరంగల్‌లో నిర్వహించాలని, దానికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా 72 అసెంబ్లీ సీట్ల‌లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఎవరు ఆపలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. యూత్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్సీ, ఎస్టీ విభాగాల నుంచి 119 ఇంఛార్జీలను నియమించుకోవాలని సూచించారు.‌

Next Story
Share it