కరోనా టైమ్ లో ఈ సన్మాలేంటి?
తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శీనివాసగౌడ్ కు బుధవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఒలంపిక్స్లో పాల్గొనేందుకు వెళుతున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్ల సన్మాన కార్యక్రమంలో మంత్రికి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. కరోనా టైమ్ లో గుంపులుగా సత్కారాలు పెట్టడంపై కోచ్లు అసహనం వ్యక్తం చేశారు. సన్మానం కోసం ఒలంపియన్ కోచ్లు స్టేజ్ మీదకి వచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు మంత్రి కోరిక మేరకు పీవీ సింధు, సాయి ప్రణీత్ మాత్రం స్టేజ్ మీదకు వచ్చారు.
గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఈ సారి ఒలింపిక్స్ జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా కరోనా ముప్పు తగ్గకపోవటంతో క్రీడాకారులు, కోచ్ లు ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో అత్యంత రిస్క్ తో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణపై వీరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.