Telugu Gateway
Telangana

మళ్ళీ లక్షకు చేరిన అమ్ముడుపోని ఫ్లాట్స్

మళ్ళీ లక్షకు చేరిన అమ్ముడుపోని ఫ్లాట్స్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు మాట్లాడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అదిరిపోతోంది అని చెపుతున్నారు. ఇందుకు ఉదాహరణగా వాళ్ళు కోకాపేట, బుద్వేల్ భూముల వేలం చూపిస్తున్నారు. ఇలా రేట్లు పెరగటానికి ప్రధాన కారణం తమ పరిపాలన తీరే అని ఘనంగా చెప్పుకుంటున్నారు. అయితే అటు కోకాపేట లో అయినా...ఇటు బుద్వేల్, మోకిలా లో రేట్లు పెరగటం (పెంచటం) వెనక భారీ కుట్ర ఉంది అనే అభిప్రాయం అటు రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు వివిధ వర్గాల ప్రజల్లో ఉంది. ముఖ్యంగా కోకాపేట లో రేట్లను వంద కోట్ల రూపాయలపైకి తీసుకువెళ్లడం వెనక 111 జీఓ రద్దు తో అందుబాటులోకి వచ్చిన లక్ష ఎకరాలకు పైగా భూమి ద్వారా భారీ ప్రయాజనం పొందే కుట్ర ఉంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 111 జీఓ పరిధిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలతో పాటు ఇతర నాయకులకు పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉంది అని ప్రచారం జరుగుతోంది. బుద్వేల్, మోకిలా వంటి ప్రాంతాల్లో ఆయా ఏరియాల్లో పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలే రేట్లు పెంచి...ఆ ధరలను చూపించి అమ్ముకుని బయటపడే ప్లాన్ లో ఉన్నాయని చెపుతున్నారు. ఇవేమి తెలియకుండా ఎవరైనా దిగితే మాత్రం వాళ్ళు బుక్ కావటం ఖాయం అని రియల్ ఎస్టేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం వాస్తవ పరిస్థితి ఏమిటి అంటే అమ్ముడు పోని ఫ్లాట్స్ నగరంలో లక్ష వరకు ఉన్నాయి.

అమ్ముడు కాకుండా పేరుకుపోయిన ఈ ఫ్లాట్స్ ( ఇన్వెంటరీ ) క్లియర్ కావాలంటే ఏడాదికి పైనే పడుతుంది. దీనికి 16 నెలల సమయం పెట్టె అవకాశం ఉంది అని ప్రముఖ రియల్ ఎస్టేట్ రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో అయితే ఇది 24 నెలలుగా ఉంది. దేశంలోనే అమ్ముడు పోని ఫ్లాట్స్ ఎక్కువ ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. ప్రభుత్వం, కొంత మంది బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి కృత్రిమ బూమ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాయి అని బిల్డర్ లు ఆరోపిస్తున్నారు. ఒక వైపు భూముల రేట్లు, నిర్మాణ వ్యయం పెరగటంతోపాటు గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగటం కూడా హోసింగ్ రంగంపై ప్రభావం చూపించినట్లు పరిశ్రమ వర్గాల మాట. అయితే హైదరాబాద్ మార్కెట్ లో ప్రీమియం ఇళ్లకు మాత్రం డిమాండ్ బాగుంది. ఇవి కొనేది ఎలాగు సంపన్నులే కనుక వాళ్లకు రేట్ అనేది పెద్ద సమస్య కాదు. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు మాత్రం పెరిగిన ధరలతో సొంత ఇంటి కల కు దూరం అవుతున్నారు. నగర శివార్లలో కూడా గేటెడ్ కమ్యూనిటీల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధరలు కూడా కోటి రూపాయలు చెపుతున్న విషయం తెలిసిందే. నగరంలో అమ్ముడు పోని ఫ్లాట్స్ లక్ష వరకు ఉంటే మాత్రం ప్రభుత్వం రంగు రంగుల కలను చూపించే ప్రయత్నం చేస్తోంది.

Next Story
Share it