Telugu Gateway
Telangana

డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగిన చోట నీహారిక‌, రాహుల్ సింప్లిగంజ్

డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగిన చోట నీహారిక‌, రాహుల్ సింప్లిగంజ్
X

హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం. డ్ర‌గ్స్ విష‌యంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వ‌స్తోంది. ఓ వైపు పోలీసులు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న త‌రుణంలో ప‌బ్ ల్లో బ‌హిరంగంగా డ్ర‌గ్స్ వాడ‌కం విష‌యం వెలుగులోకి రావ‌టం మ‌రింత దుమారం రేపుతోంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా రాడిస‌న్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ లో జ‌రిగిన రేవ్ పార్టీలో డ్ర‌గ్స్ వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. అదే స‌మయంలో ఈ పార్టీలో ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కుమార్తె నిహారిక‌, బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సింప్లిగంజ్ ను కూడా పోలీసులు స్టేష‌న్ కు తీసుకొచ్చారు. వీరితోపాటు డ్రగ్స్ పార్టీలో మాజీ ఎంపీ అంజనీ కుమార్ కొడుకు అరవింద్ , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, ఓ మాజీ డీజీపీ కుమార్తె ఉన్నారు. రాడిసన్ హోటల్ పుడింగ్ మింగ్ పబ్‌ను అధికారులు సీజ్ చేశారు.

పొలీసుల‌ను చూసి డ్రగ్స్‌ను యువతీయువకులు బయటకు విసిరేశారు. ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. డెకాయ్ ఆపరేషన్‌లో డ్రగ్స్ బాగోతం బట్ట బయలైంది. పబ్‌ నుంచి స్టేషన్‌కు తరలించిన 150 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులో ఉన్న వారి నుంచి అనుమానాస్పద ప్యాకెట్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లో లేట్ నైట్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు రాడిసన్ బ్లూ హోటల్‌లో దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొంత మంది యువకులు హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ ఆందోళనకు దిగారు. అయితే విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టినట్టు స‌మాచారం.

Next Story
Share it