Telugu Gateway
Telangana

ఎన్ డీఎస్ఏ తుది నివేదికతో బహిర్గతం అయిన డొల్లతనం

ఎన్ డీఎస్ఏ తుది నివేదికతో బహిర్గతం అయిన డొల్లతనం
X

ప్రాజెక్ట్ కు చిన్న పగుళ్లు వస్తే నానా గొడవ చేస్తున్నారే?. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ లు కూలిపోలేదా...కొట్టుకుపోలేదా?. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర భారీ పగుళ్లు వచ్చిన సమయంలో బిఆర్ఎస్ నేతలు స్పందించిన తీరు ఇది . బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బిఆర్ఎస్ హయాంలో కొంత కాలం సాగునీటి శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు లాంటి వాళ్ళు పదే పదే ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను రిపేర్ చేసి వాడు కోవచ్చు అని...కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ బిఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్ డీఎస్ఏ) మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న లక్ష కోట్ల నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్టినట్లు బహిర్గతం చేసింది. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ను తిరిగి పట్టాలు ఎక్కించాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు తిరిగి వ్యయం చేయాల్సి ఉంటుందో తెలియని పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టిన మేడిగడ్డ , అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజ్ ల డిజైన్ లను పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎన్ డీఎస్ఏ తుది నివేదిక స్పష్టం చేసింది.

డిజైన్ ల దగ్గర నుంచి నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ఉంది అని ఈ నివేదిక బహిర్గతం చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్ వద్ద జరిగిన నష్టాన్ని చూస్తే రిపేర్ సాధ్యం కాదు అని..ఇక్కడ గేట్లు నిర్వహించటానికి కూడా వీలు లేదు అన్నారు. ఈ బ్లాక్ కు పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్ లకు నష్టం వాటిల్ల కుండా చూడాల్సిన అవరం ఉంది అన్నారు. జియో టెక్నీకల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే బ్యారేజ్ ల నిర్మాణ స్థలాలు మార్చారు అని ఈ నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే ఆదర్శం అని అప్పటిలో కెసిఆర్ చాలా గొప్పలు చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాదు...ఈ ప్రాజెక్ట్ డిజైన్ లు కూడా తానే సిద్ధం చేసానని పలు మార్లు చెప్పుకున్నారు.

ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సమస్యల్లో చిక్కుకుందో అప్పటి నుంచి మాట మార్చి ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలని అంటూ స్వరం మార్చిన సంగతి తెలిసిందే. ఎన్ డీఎస్ఏ తుది నివేదిక పైన కూడా బిఆర్ఎస్ తన కు అలవాటు అయిన ఎదురుదాడి మోడల్ నే ఫాలో అవుతోంది. ఇది ఎన్ డీఎస్ఏ నివేదిక కాదు..ఎన్డీఏ నివేదిక అంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో కూలిపోయిన ప్రాజెక్ట్ ల మీద ఎందుకు ఇలాంటి నివేదికలు రాలేదు అని అయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ నివేదికపై క్యాబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ నివేదిక చూసిన తర్వాత అయిన బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రైతులు...ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల డబ్బును ఇష్ఠానుసారం ఖర్చుపెట్టి దోచుకున్నారు అని ఆరోపించారు. కాగ్ నివేదికల తో పాటు ఎన్నో నివేదికలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలను బహిర్గతం చేసినా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎన్ డీఎస్ఏ తుది నివేదిక తర్వాత అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగానికి కారకులు అయిన వారిపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచిచూడాలి.

Next Story
Share it