Telugu Gateway
Telangana

కాళ్ళు పట్టుకుంటే ఓట్లు వేస్తారుగా

కాళ్ళు పట్టుకుంటే ఓట్లు వేస్తారుగా
X

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. బిజెపి పచ్చని హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఓట్ల కోసం బండి సంజయ్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సంజయ్ కు ఓట్లు కావాలంటే అడుక్కుంటే..ప్రజల కాళ్ళు పట్టుకుంటే వేస్తారు కదా? సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సర్జికల్ స్ట్రైక్స్ చేయటానికి హైదరాబాద్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా?. లేక చైనాలో ఉందా? అని కెటీఆర్ ప్రశ్నించారు.

సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుండి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు ఆలోచించి కెసీఆర్ నాయకత్వాన్ని సమర్ధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో కులాలను వర్గాలుగా విడదీసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఒక్క ఎన్నిక కోసం బీజేపీ నేతలు పిచ్చిలేచినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్ళ మాటలు చూస్తుంటే మనం హైదరాబాద్ లో ఉన్నామా లేదంటే ఎక్కడ ఉన్నామో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ ప్రజలుగా కలవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ఇంత దిగజారాలా..ఇదెక్కడి పద్దతి..ఇదేమి విధానం అని ప్రశ్నించారు.

Next Story
Share it