డ్రోన్ల ద్వారా మందుల సరఫరా
తెలంగాణ సర్కారు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాకు డ్రోన్లను ఉపయోగించనున్నారు. దేశంలోనే ఈ తరహా కార్యక్రమం శనివారం నాడు వికారాబాద్ లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింథియా, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మందుల సరఫరా కోసం మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్ట్ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య శనివారం ప్రారంభించారు.సమారు 40 కిలోమీటర్ల వరకు డ్రోన్లు ప్రయాణించనున్నాయి.
ఒక్కో డ్రోన్లో 15 రకాల ఔషధాలు, టీకాల సరఫరాకు అవకాశం ఉంది. భూమికి 500-700 మీటర్ల ఎత్తులో డ్రోన్ ప్రయాణించనుంది. శనివారం నాడు మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ డ్రోన్ల ద్వారా మందుల సరఫరా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్క అరోగ్య రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో డ్రోన్ల ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మైనింగ్ రంగంలోకి అక్రమాలను నిరోధించేందుకు కూడా డ్రోన్ల సేవలను ఉపయోగించవచ్చన్నారు.